వరంగల్‌ విమానాశ్రయంపై ముందడుగు

వరంగల్‌ విమానాశ్రయ నిర్మాణానికి చిక్కుముడులు ఒక్కటొక్కటిగా వీడుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ప్రాంతీయ విమానాశ్రయం విషయంలో కొంతకాలంగా ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ (ఏఏఐ) వేచి చూసే ధోరణితో ఉంది.

Updated : 19 May 2024 09:02 IST

నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలత
త్వరలో రానున్న ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ అధికారులు

ఈనాడు, హైదరాబాద్‌: వరంగల్‌ విమానాశ్రయ నిర్మాణానికి చిక్కుముడులు ఒక్కటొక్కటిగా వీడుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ప్రాంతీయ విమానాశ్రయం విషయంలో కొంతకాలంగా ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ (ఏఏఐ) వేచి చూసే ధోరణితో ఉంది. వరంగల్‌ విమానాశ్రయాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించటంతో ఏఏఐ అధికారుల్లో కదలిక వచ్చింది. ఎయిర్‌పోర్ట్స్‌ నిర్మాణానికి వీలుగా ప్రస్తుతం ఉన్న 706 ఎకరాల భూమికి అదనంగా 253 ఎకరాలు కేటాయిస్తూ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు ముందుగానే మునుపటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌కు చెందిన జీఎమ్మార్‌ ఎయిర్‌పోర్ట్‌తో పాటు రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి కూడా అనుమతులు తీసుకోవాల్సి ఉందని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. భూమి కేటాయింపు ఉత్తర్వుల నేపథ్యంలో ఏఏఐ అధికారులు వరంగల్‌ విమానాశ్రయం పరిస్థితులపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. కానీ దీనిపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఎలాంటి సమాచారం లేకపోవటంతో అయోమయం నెలకొంది. విమానాశ్రయ నిర్మాణం కోసం పరిశీలన చేశారా? మరేదైనా కారణాలతో సర్వే చేశారా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. 

దశల వారీగా విస్తరణ? 

విమానాశ్రయాన్ని దశల వారీగా విస్తరించాలని మునుపటి ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత ఏటీఆర్‌ స్థాయి చిన్న విమానాల రాకపోకలకు వీలుగా నిర్మించాలనుకున్నారు. దీనికి అనుగుణంగా మునుపటి ప్రభుత్వం 253 ఎకరాలను కేటాయించింది. అయితే కనీసం 400 ఎకరాలు కావాలని ఏఏఐ అధికారులు తమ నివేదికలో స్పష్టం చేశారు. విస్తరణకు సుమారు రూ.1,200 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. అంత మొత్తాన్ని ఖర్చు చేసేందుకు అప్పటి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయలేదని అధికారులు చెబుతున్నారు. రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్లతో విమానాల రాకపోకలకు ఏర్పాట్లు చేయాలని చెప్పడమే కాకుండా ఆ మేరకు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు స్పష్టంచేసింది. నిజానికి ఒకేసారి నిర్మాణాన్ని చేపట్టడమే అన్ని రకాలుగా ఉపయుక్తంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం విమానాశ్రయ నిర్మాణానికి సుముఖత వ్యక్తం చేసినా ఏ స్థాయిలో అన్నది నిర్ణయించాల్సి ఉంది. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ ముగిసిన తరవాత వరంగల్‌ విమానాశ్రయం వ్యవహారాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్షించనున్నారు. పూర్తిస్థాయిలో అభివృద్ధా? లేక మునుపటి ప్రభుత్వం నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్లడమా? అన్నది అప్పుడు ఖరారవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిపై సమీక్షించేందుకు ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా అధికారుల బృందం త్వరలో రాష్ట్రానికి రానున్నట్లు సమాచారం. ఆ బృందం వరంగల్‌లోని ప్రస్తుతం ఎయిర్‌ స్ట్రిప్‌ను పరిశీలించటంతోపాటు ఉన్నతాధికారులతో చర్చలు నిర్వహించాలని నిర్ణయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు