BCG Vaccine: పెద్దలకు బీసీజీ టీకా

క్షయ(టీబీ) వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా తొలిసారిగా 18 ఏళ్లు పైబడినవారికి బీసీజీ టీకా కార్యక్రమానికి రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ శ్రీకారం చుడుతోంది.

Updated : 22 May 2024 07:38 IST

జులై ఆఖరు లేదా ఆగస్టులో ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: క్షయ(టీబీ) వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా తొలిసారిగా 18 ఏళ్లు పైబడినవారికి బీసీజీ టీకా కార్యక్రమానికి రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ శ్రీకారం చుడుతోంది. మొదటి దశలో రాష్ట్రంలో ఎంపిక చేసిన 17 జిల్లాల్లో గుర్తించిన సుమారు 60 లక్షల మందికి ఒక డోసు టీకా ఇచ్చేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తోంది. జులై చివరివారం లేదా ఆగస్టు మొదటివారంలో ఇది ప్రారంభం కానుంది. అప్పటి నుంచి మూడు నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు పిల్లలకు బీసీజీ వ్యాక్సిన్‌ ఇస్తుండగా 2025 నాటికి క్షయ నిర్మూలనే లక్ష్యంగా తొలిసారిగా 18 ఏళ్లు పైబడినవారికి ఇవ్వనున్నారు. జాతీయ క్షయ వ్యాధి నిర్మూలనలో భాగంగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ దీన్ని నిర్దేశించింది. జాతీయ ఆరోగ్య మిషన్‌ ద్వారా ఇది అమలవుతోంది. ఇప్పటికే దేశంలో తొలివిడతగా ఎనిమిది రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌ మొదలైంది. తాజాగా మలివిడతలో తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లో అమలుకానుంది. రాష్ట్ర క్షయవ్యాధి నిర్మూలన విభాగం నోడల్‌ సంస్థగా దీన్ని నిర్వహిస్తోంది. టీబీ వచ్చే అవకాశం ఉందని గుర్తించిన వారికి మాత్రమే టీకా ఇవ్వనున్నారు. ఎవరెవరికి ఇవ్వాలని గుర్తించేందుకు ఆరు కేటగిరీలను నిర్దేశించుకున్నారు. 

పెద్దల టీకా అమలయ్యే జిల్లాలు

హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్‌-మల్కాజిగిరి, నాగర్‌ కర్నూల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, హనుమకొండ, యాదాద్రి-భువనగిరి.


ఎవరెవరికి అంటే...

  • 60 ఏళ్లు పైబడినవారందరికీ 
  • బీఎంఐ 18 కంటే తక్కువ ఉన్నవారు
  • మద్యం తాగేవారు 
  • ఇప్పుడు పొగతాగుతున్నవారు, గతంలో పొగతాగినవారు
  • క్షయవ్యాధిగ్రస్తులకు సన్నిహితంగా ఉన్నవారు 
  • గత ఐదేళ్లుగా క్షయ వ్యాధిగ్రస్తులున్న ఇంట్లోని ఇతర కుటుంబ సభ్యులకు

ఇంటింటి సర్వేతో గుర్తింపు

రాష్ట్రంలో పెద్దలకు ఉచితంగా బీసీజీ వ్యాక్సినేషన్‌కు వీలుగా అవసరమైన కార్యాచరణ చురుకుగా సాగుతోంది. ఇప్పటికే వివిధ స్థాయుల్లో శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ ఆరోగ్యకేంద్రాలు, వెల్‌నెస్, వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో ఇస్తాం. సుమారు 60 లక్షల మందికి టీకా ఇవ్వాల్సి ఉంటుందని ప్రాథమిక అంచనా. ఎవరెవరికి ఇవ్వాలనేది ఇంటింటి సర్వే ఆధారంగా గుర్తిస్తాం. హెచ్‌ఐవీ బాధితులు, అవయవమార్పిడి చేసుకున్నవారు, గర్భిణులు, బాలింతలు, ఇతర వ్యాక్సిన్‌ల రియాక్షన్‌లు ఉన్నవారు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, టీకా తీసుకోవడానికి ఇష్టపడని వారికి ఇవ్వం. డీఎంహెచ్‌ఓ, జిల్లా క్షయవ్యాధి నిర్మూలన అధికారి పర్యవేక్షణలో ఇతర ప్రభుత్వ ఆరోగ్య విభాగాల సమన్వయంతో ఈ ప్రత్యేక కార్యక్రమం అమలు చేస్తాం. 

ఎ.రాజేశం, జాయింట్‌ డైరెక్టర్, క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమం, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని