Uttam Kumar Reddy: మరింత వేగంగా పట్టణీకరణ

Eenadu icon
By Ts Top News News Desk Published : 21 Aug 2024 04:52 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

రియల్‌ ఎస్టేట్‌ రంగానికి అండగా ఉంటాం 
క్రెడాయ్‌ సదస్సులో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  

క్రెడాయ్, సీబీఆర్‌ఈ రూపొందించిన ‘తెలంగాణ గోయింగ్‌ గ్లోబల్‌’ నివేదికను ఆవిష్కరించి ప్రదర్శిస్తున్న మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. చిత్రంలో క్రెడాయ్‌ తెలంగాణ కార్యవర్గం 

ఈనాడు, హైదరాబాద్‌ : తెలంగాణను అభివృద్ధిలో మరోస్థాయికి తీసుకెళతామని రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో పట్టణీకరణ మరింత వేగంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రగతిలో బిల్డర్లు క్రియాశీల పాత్ర పోషించాలన్నారు. క్రెడాయ్‌ తెలంగాణ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌ హెచ్‌ఐఐసీలో ‘స్టేట్‌కాన్‌ 2024’ సదస్సును రహదారులు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. సీబీఆర్‌ఈ, క్రెడాయ్‌ తెలంగాణ సంయుక్తంగా రూపొందించిన ‘తెలంగాణ గోయింగ్‌ గ్లోబల్‌’ నివేదికను ఈ సందర్భంగా మంత్రులు ఆవిష్కరించారు. అనంతరం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. భూముల ధర పెంపునకు క్రెడాయ్‌ మద్దతు పలకడం సంతోషంగా ఉందన్నారు. క్రెడాయ్‌ లేవనెత్తిన జోనింగ్‌ సమస్యలు, పెరీ అర్బన్‌లో నిర్మాణ ఆంక్షలు, రిజిస్ట్రేషన్‌ ఛార్జీల తగ్గింపు, మాస్టర్‌ప్లాన్‌లో మార్పుల వంటి వాటిపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని హామీఇచ్చారు. రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ఆర్‌ఆర్‌ఆర్‌కు రెండు, మూడు నెలల్లో టెండర్లు పిలవనున్నట్లు వెల్లడించారు. రేడియల్‌ రహదారుల అభివృద్ధికి రుణాల కోసం దరఖాస్తు చేశామన్నారు. క్రెడాయ్‌ తెలంగాణ ఛైర్మన్‌ మురళీకృష్ణారెడ్డి మాట్లాడుతూ..  భూముల ధరలు పెంచడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను 7.5 నుంచి 5 శాతానికి తగ్గించాలని, మహిళల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేస్తే 1 శాతం అదనంగా తగ్గింపు ఇవ్వాలని కోరారు. క్రెడాయ్‌ తెలంగాణ అధ్యక్షుడు ప్రేంసాగర్‌రెడ్డి మాట్లాడుతూ.. లేఅవుట్ల అనుమతులపై అధికారం కలెక్టర్‌కు ఇవ్వడంతో ప్రక్రియ ఆలస్యమవుతుందని, దీన్ని సులభతరం చేయాలని కోరారు. భువనగిరి ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి, క్రెడాయ్‌ జాతీయ కార్యదర్శి గుమ్మి రాంరెడ్డి, క్రెడాయ్‌ జాతీయ కార్యవర్గ సభ్యులు సీహెచ్‌.రాంచంద్రారెడ్డి, క్రెడాయ్‌ తెలంగాణ ఎలెక్ట్‌ ఇంద్రాసేనారెడ్డి, కార్యదర్శి అజయ్‌కుమార్, ఉపాధ్యక్షులు పాండురంగారెడ్డి, పురుషోత్తంరెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, సీబీఆర్‌ఈ ఈడీ సౌరవ్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

టీటీఆర్‌ కీలకపాత్ర...

తెలంగాణ రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో ప్రతిభ (టాలెంట్‌), సాంకేతికత(టెక్నాలజీ), స్థిరాస్తి(రియల్‌ ఎస్టేట్‌).. ఈ మూడూ(టీటీఆర్‌) కీలకంగా ఉన్నాయని సీబీఆర్‌ఈ-క్రెడాయ్‌ తెలంగాణ నివేదిక వెల్లడించింది. సదస్సులో ఈ నివేదికను విడుదల చేశారు. నైపుణ్యం ఉన్న మానవ వనరులతో గ్లోబల్‌ కేపబుల్‌ సెంటర్స్‌(జీసీసీ) హైదరాబాద్‌కు వస్తున్నాయని వెల్లడించింది. 2022 నుంచి 2024 ప్రథమార్ధం వరకు దేశంలోని 53 మిలియన్‌ చ.అ. లీజింగ్‌లో 21 శాతం హైదరాబాద్‌లో నమోదైందని తెలిపింది. వచ్చే మూడేళ్లలో 34-37 మిలియన్‌ చ.అడుగుల బిజినెస్‌ పార్క్‌లు రాబోతున్నాయని వెల్లడించింది. 1.30 లక్షల యూనిట్ల గృహ నిర్మాణాలు రాబోతున్నాయని నివేదిక వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని