Corona: వుహాన్‌ కుక్కల నుంచి పాకిన కరోనా?

చైనాలోని వుహాన్‌ చేపల మార్కెట్‌లో విక్రయించిన రాకూన్‌ జాతి కుక్కల జన్యుపదార్థంలో కొవిడ్‌ కారక సార్స్‌కోవ్‌-2 వైరస్‌ ఆనవాళ్లు కనిపించాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం తెలిపింది.

Updated : 18 Mar 2023 08:51 IST

న్యూయార్క్‌: చైనాలోని వుహాన్‌ చేపల మార్కెట్‌లో విక్రయించిన రాకూన్‌ జాతి కుక్కల జన్యుపదార్థంలో కొవిడ్‌ కారక సార్స్‌కోవ్‌-2 వైరస్‌ ఆనవాళ్లు కనిపించాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం తెలిపింది. దీన్నిబట్టి కొవిడ్‌ కారక కరోనా వైరస్‌ ప్రయోగశాలలో కృత్రిమంగా సృష్టించినది కాదనీ, అది ప్రకృతిలో సహజంగానే ఉత్పన్నమై ఉండవచ్చని వారు భావిస్తున్నట్లు ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ దినపత్రిక తెలిపింది. వైరస్‌ ప్రయోగశాల నుంచి లీకై ఉండవచ్చని అమెరికా ఇంధనశాఖ అంచనా వేసిన కొన్ని వారాలకే దానికి విరుద్ధమైన అంచనాను అంతర్జాతీయ శాస్త్రవేత్తలు వెలువరించడం విశేషం.

వుహాన్‌లోని హువానాన్‌ టోకు చేపల మార్కట్‌ నుంచి కొవిడ్‌ వైరస్‌ వ్యాపించిందనే అనుమానంతో చైనా అధికారులు 2020 జనవరిలో ఆ మార్కెట్‌ను మూసివేశారు. ఆ సమయంలో చైనా శాస్త్రజ్ఞులు మార్కెట్‌ నుంచి జన్యు నమూనాలను సేకరించారు. అప్పటికే మార్కెట్‌ నుంచి జంతువులను తొలగించినందున అక్కడి ఖాళీ బోనులు, గోడలు, గచ్చు, బండ్ల మీద నుంచి జన్యు నమూనాలు సేకరించి జీనోమ్‌ సీక్వెన్స్‌ను అంతర్జాతీయ ఏవియన్‌ ఫ్లూ సమాచార మార్పిడి వేదికలో ఉంచారు. వుహాన్‌ మార్కెట్‌లో ఒక బండిపై పక్షుల పంజరం ఉంచగా.. వేరే బోనులో రాకూన్‌ కుక్కలను ఉంచినట్లు శాస్త్రజ్ఞుల దృష్టికి వచ్చింది. ఇది ఒక జంతువు నుంచి మరో జంతువుకు వైరస్‌ వ్యాపించడానికి అనువైన స్థితి. అక్కడ సేకరించిన జన్యు నమూనాలో రాకూన్‌ కుక్క న్యూక్లిక్‌ ఆమ్లం, వైరస్‌ న్యూక్లిక్‌ ఆమ్లం కలిసి ఉన్నాయని కనిపెట్టారు. ఒకవేళ రాకూన్‌ కుక్కకు కొవిడ్‌ వైరస్‌ సోకినా దాని నుంచి అది నేరుగా మానవులకు వ్యాపించి ఉండకపోవచ్చనీ, అసలు మానవుల ద్వారానే కుక్కకు వైరస్‌ సోకి ఉండవచ్చనీ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. మరేదైనా జంతువు నుంచి కూడా రాకూన్‌ కుక్కకు కొవిడ్‌ వైరస్‌ సోకి ఉండవచ్చంటున్నారు. ప్రస్తుతానికి జంతువుల నుంచే మానవులకు వైరస్‌ సోకిందని అనుకోడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ప్రపంచంలో మొట్టమొదటి కరోనా వైరస్‌ కేసు 2019లో చైనాలోని వుహాన్‌ రాష్ట్రంలో నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని