Iran-Israel: ‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్‌ను హేళన చేసిన ఇరాన్‌

Iran-Israel: తమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌ తీవ్ర నిర్ణయాలు తీసుకుంటే ప్రతిస్పందన చాలా కఠినంగా ఉంటుందని ఇరాన్‌ హెచ్చరించింది. ఈ సందర్భంగా టెల్‌ అవీవ్‌పై వ్యంగ్యాస్త్రాలు గుప్పించింది.

Published : 20 Apr 2024 10:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ వేడెక్కాయి. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్‌ (Iran)లోని మూడో అతి పెద్ద నగరమైన ఇస్ఫహాన్‌లో పేలుళ్లు సంభవించాయి. ఇది ఇజ్రాయెల్‌ (Israel) ప్రతీకార దాడేనంటూ అమెరికా చెప్పగా.. టెల్‌ అవీవ్‌, టెహ్రాన్‌ మాత్రం దీన్ని ధ్రువీకరించలేదు. తాజా పరిణామాలపై ఇరాన్‌ విదేశాంగ మంత్రి హొస్సేన్‌ అమీర్‌ అబ్దుల్లాహియాన్‌ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. దాడులకు ఉపయోగించినవి తమకు ఆటబొమ్మల్లాంటివంటూ ఇజ్రాయెల్‌పై వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ఇదే సమయంలో అవసరమైతే తమ స్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.

అమెరికాలోని న్యూయార్క్‌ పర్యటనలో ఉన్న హొస్సేన్‌.. అగ్రరాజ్య భద్రతా మండలి సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘శుక్రవారం జరిగింది దాడే కాదు. అవి డ్రోన్లు కాదు.. మా పిల్లలు ఆడుకునే ఆటబొమ్మల్లాంటివి. మా దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌ ఎలాంటి సాహసం చేయలేదు కాబట్టి.. ఇప్పుడు మేం ప్రతిచర్యకు దిగట్లేదు. కానీ ఒకవేళ ఆ దేశం మాకు నష్టం కలిగించేలా తీవ్ర నిర్ణయాలు తీసుకుంటే మాత్రం.. మా ప్రతిస్పందన చాలా వేగంగా, కఠినంగా ఉంటుంది. దానికి వాళ్లు పశ్చాత్తాపపడాల్సి ఉంటుంది’’ అని నెతన్యాహు సర్కారును హెచ్చరించారు.

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడి!

ఇరాక్‌లోనూ దాడులు..

ఇదిలా ఉండగా.. ఇరాక్‌లోని ఇరాన్‌ మద్దతున్న స్థావరాలపై శనివారం తెల్లవారుజామున దాడులు జరిగాయి. మొత్తం ఐదు పేలుళ్లు సంభవించగా.. ఈ ఘటనలో కనీసం ముగ్గురికి గాయాలైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించారు. ఈ పేలుళ్లకు కారణమేంటనేది ఇంకా స్పష్టత రాలేదు. తాజా ఘటనతో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి.

ఈ నెల 13న మూడు వందలకుపైగా డ్రోన్లు, క్షిపణులతో భారీ స్థాయిలో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడినప్పటి నుంచి ఇజ్రాయెల్‌ ప్రతీకారంతో రగిలిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌లో పేలుడు శబ్దాలు వినిపించడంతో ప్రతీకార దాడులు మొదలైనట్లు అంతా భావించారు. అయితే, ఇరాన్‌ మాత్రం ఖండించింది. తమ గగనతలంలో కనిపించిన అనుమానాస్పద వస్తువులను యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్‌ తుపాకులతో నేలకూల్చామని, ఆ సందర్భంగా పేలుళ్లు జరిగాయని పేర్కొంది. ఇజ్రాయెలే దాడి చేసినట్లు అధికారికంగా ప్రకటించలేదు. అటు టెల్‌ అవీవ్‌ కూడా దీనిపై స్పందించేందుకు నిరాకరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని