Khalistani ఉగ్ర కుట్రలు.. మాస్టర్‌ మైండ్‌ ‘పన్నూ’..!

భారత్‌ను విభజించి అనేక దేశాలు సృష్టించాలని ఖలిస్థాన్‌ ఉగ్రవాది కోరుకుంటున్నట్లు ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలినట్లు సమాచారం.

Published : 25 Sep 2023 19:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కెనడాలో ఉంటున్న హిందువులు భారత్‌కు వెళ్లిపోవాలంటూ ఖలిస్థాన్‌ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ ఇటీవల హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడున్న హిందూ కెనడియన్లు భయాందోళనలకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో గట్టి చర్యలకు ఉపక్రమించిన భారత్‌.. ఇక్కడున్న అతడి ఆస్తులను జప్తు చేసింది. అటువంటి ఉగ్రవాది భారత్‌ను విభజించి అనేక దేశాలు సృష్టించాలని కోరుకుంటున్నట్లు ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

నిషేధిత వేర్పాటువాద సంస్థ ‘సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌’ అధినేత గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తులో సంచలన విషయాలు వెల్లడైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ‘భారతదేశ ఐక్యత, సమగ్రతను సవాలు చేస్తూ ఆడియో మెసేజ్‌లు విడుదల’ చేసినట్లు వెల్లడైంది. దేశాన్ని మతపరంగా విభజించి ఓ వర్గానికి ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాడట.

అటువంటి వారు కెనడాను వీడండి.. వేర్పాటువాది బెదిరింపు

పంజాబ్‌తోపాటు దేశవ్యాప్తంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడంతోపాటు ఉగ్ర కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తోన్న గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) 2019లో మోస్ట్‌ వాంటెడ్‌గా ప్రకటించింది. ప్రత్యేక ఖలిస్థాన్‌ కోసం పోరాడటంతోపాటు ఉగ్రకార్యకలాపాల్లో పాల్గొనేలా యువతను ప్రేరేపిస్తున్నట్లు ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలింది. దీంతో అదే ఏడాది సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ను నిషేధించింది. ఆ తర్వాత 2022లో పన్నూను కేంద్ర హోంశాఖ ఉగ్రవాదిగా ప్రకటించింది. అయితే, అతడిపై రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీచేయాలని భారత ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని ఇంటర్‌పోల్‌ రెండుసార్లు తిరస్కరించింది. తాజాగా కెనడా-భారత్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ కెనడాలోని హిందువులపై మరోసారి బెదిరింపులకు పాల్పడ్డాడు.

ఓసీఐ రద్దుకూ ప్రతిపాదన..

కెనడా కేంద్రంగా భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిని ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేస్తోన్న ఎన్‌ఐఏ.. గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూకు పంజాబ్‌లో ఉన్న ఆస్తులను జప్తు చేసిన విషయం తెలిసిందే. ఇతడితోపాటు వివిధ దేశాల్లో నివసిస్తోన్న మరో 19 మంది ఖలిస్థానీ ఉగ్రవాదుల (Khalistani Terrorists) ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వీటితోపాటు వివిధ దేశాల్లో ఉన్న ఖలిస్థానీ ఉగ్రవాదులను గుర్తించి.. వారి ఓసీఐ (ఓవర్సీస్‌ సిటిజన్‌ ఆఫ్‌ ఇండియా) కార్డును రద్దు చేయాలని ఆయా విభాగాలకు ప్రభుత్వం సూచించినట్లు సమాచారం. తద్వారా వారు మళ్లీ భారత్‌లో అడుగుపెట్టకుండా అడ్డుకోవచ్చనేది భారత్‌ అభిప్రాయంగా సదరు కథనాలు పేర్కొన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు