Mike Tyson: ‘ఆ పంచ్‌ దెబ్బలకు రూ.3 కోట్లు ఇవ్వండి’.. మైక్‌ టైసన్‌ను డిమాండ్‌ చేసిన బాధితుడు

Mike Tyson: మైక్‌ టైసన్‌ చేతిలో గతేడాది దెబ్బలు తిన్న ఓ వ్యక్తి.. ఇప్పుడు పరిహారం కోరుతున్నాడు. ఆ దెబ్బలకు అయిన చికిత్సకు రూ.3 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు.

Updated : 02 Dec 2023 15:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దిగ్గజ బాక్సర్, మాజీ ఛాంపియన్​ మైక్ టైసన్‌ (Mike Tyson) ​న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏడాదిన్నర క్రితం ఆయన విమానంలో తోటి ప్రయాణికుడిపై పంచ్‌ల వర్షం కురిపించిన ఘటన గుర్తుంది కదా..! నాడు టైసన్‌ చేతిలో దెబ్బలు తిన్న బాధితుడు ఇప్పుడు ఆయన నుంచి పరిహారం డిమాండ్‌ చేస్తున్నాడు. ఆ దెబ్బలకు అయిన చికిత్సకు గానూ తనకు 3,50,000 పౌండ్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.3.6 కోట్లు) పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు.

గతేడాది ఏప్రిల్‌లో శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఫ్లోరిడా వెళ్తున్న విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఆ రోజు మైక్‌ టైసన్‌ (Mike Tyson) తన సీట్లో కూర్చుని ఉండగా.. ఆయన వెనుక కూర్చున్న మెల్విన్‌ టౌన్‌సెండ్‌ అనే మరో ప్రయాణికుడు బాగా ఇబ్బంది పెట్టినట్లు ఆ వీడియోలో కన్పించింది. తన చేష్టలతో మెల్విన్‌ పలుమార్లు చిరాకు తెప్పించడంతో.. సహనం కోల్పోయిన టైసన్‌ తన సీట్లో నుంచి లేచి అతడిని చితకబాదాడు. దీంతో బాధితుడి మొహం నుంచి రక్తం వచ్చినట్లు కూడా ఆ వీడియోలో కన్పించింది.

చైనాకు రాకపోకలు నిషేధించండి: బైడెన్‌ను కోరిన సెనెటర్లు

ఈ ఘటనపై అప్పట్లో పోలీసులు ఇద్దర్నీ విచారించారు. దీనికి సంబంధించి బాధితుడు ఫిర్యాదు చేయకపోవడంతో టైసన్‌పై ఎలాంటి క్రిమినల్‌ కేసు నమోదు చేయలేదు. అయితే, ఈ ఘటన జరిగిన ఏడాదిన్నర తర్వాత బాధితుడు మెల్విన్‌.. తాజాగా టైసన్‌ నుంచి పరిహారం డిమాండ్‌ చేయడం గమనార్హం. ఈ మేరకు మెల్విన్‌ తరఫు న్యాయవాదులు.. టైసన్‌కు ఓ లేఖ పంపించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

టైసన్‌ పంచ్‌లకు తాను తీవ్రంగా గాయపడ్డానని మెల్విన్‌ ఆ లేఖలో ఆరోపించాడు. ఆ దాడి తర్వాత తనకు జ్ఞాపకశక్తి సమస్యలు, నిద్రలేమి, వర్టిగో, మానసిక ఒత్తిడి, తీవ్ర తలనొప్పి వంటి సమస్యలు ఎదురయ్యాయని పేర్కొన్నాడు. ఇందుకు తాను ఇప్పటికీ చికిత్స తీసుకుంటున్నానని తెలిపాడు. ఇన్స్యూరెన్స్‌ లేకపోవడంతో చికిత్స కోసం తాను చాలా ఖర్చు చేయాల్సి వస్తోందని పేర్కొన్నాడు. ఆ దెబ్బలకు అయిన చికిత్స ఖర్చులకు గానూ టైసన్‌ తనకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశాడు. ఈ పరిహారం ఇవ్వకపోతే తాను కోర్టులో పరువునష్టం దావా వేస్తానని మెల్విన్‌ బెదిరించినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ సెటిల్‌మెంట్‌ డిమాండ్‌ను టైసన్‌ తరఫు న్యాయవాదులు ఖండించినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని