Putin: 80 ఏళ్ల తర్వాత.. మళ్లీ సరిహద్దుల్లో వారి ట్యాంకులు..!

యుద్ధంలో ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తున్న పశ్చిమ దేశాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్(Putin) గట్టిగా బదులిచ్చారు. ఎన్ని ప్రమాదాలు వచ్చినా ఎదుర్కోవడం రష్యాకు తెలుసన్నారు. 

Updated : 03 Feb 2023 15:38 IST

మాస్కో: ఉక్రెయిన్‌(Ukraine)పై రష్యా(Russia) జరుపుతోన్న దురాక్రమణ మొదలై ఏడాది కావొస్తోంది. దీని ముగింపు మాటే వినిపించడంలేదు. అమెరికా, జర్మనీ దేశాలు ఉక్రెయిన్‌కు యుద్ధ ట్యాంకులు ఇవ్వాలని నిర్ణయించడంపై ఇప్పటికే రష్యా తీవ్రంగా మండిపడింది. దీనిపై తాజాగా ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌(Putin) స్పందించారు. 80 ఏళ్ల తర్వాత చరిత్ర పునరావృతమవుతోందని జర్మనీ ట్యాంకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 

అమెరికా(US) నుంచి 30 ఎం1 అబ్రామ్స్‌ ట్యాంకులు, జర్మనీ(Germany)నుంచి దాదాపు 14 లెపర్డ్‌ 2 ట్యాంకులు ఉక్రెయిన్‌కు అందనున్నాయి. ‘రణరంగంలో రష్యా(Russia)ను ఓడించాలని చూసేవారికి ఒక విషయం అర్థం కావడం లేదు. ఆధునిక యుగంలో రష్యాను ఎదుర్కోవడం వారికి సులువు కాదు. మేం మా ట్యాంకులను వారి సరిహద్దుల్లోకి పంపడం లేదు. కానీ, వారిని ఎదుర్కొనే మార్గాలున్నాయి. యుద్ధం ఆయుధాలకే పరిమితం కాదని వారు అర్థం చేసుకోవాలి. దురదృష్టవశాత్తూ ఆధునిక ముసుగులో నాజీ భావజాలాన్ని చూస్తున్నాం. అది మరోసారి మన దేశ భద్రతకు ముప్పుగా పరిణమించింది. మరోసారి పశ్చిమ దేశాల దురాక్రమణను కలిసికట్టుగా ఎదుర్కొవాల్సి వస్తుంది. రష్యా మరోసారి జర్మనీ ట్యాంకులతో ముప్పును ఎదుర్కొంటుందనేది నమ్మలేని నిజం. అయితే, రష్యా తన భద్రతకు ప్రమాదంగా మారిన వాటికి గతంలో తగిన సమాధానం కూడా  చెప్పింది’ అని పశ్చిమ దేశాలు మరీ ముఖ్యంగా జర్మనీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.  

వొల్గొగ్రాడ్ వద్ద మాట్లాడుతూ పుతిన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. స్టాలిన్‌ గ్రాడ్ యుద్ధం జరిగిన 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. ఆనాటి పోరాటంలో భాగమైన వారికి అధ్యక్షుడు నివాళి అర్పించారు. రెండో ప్రపంచ యుద్ధంలో స్టాలిన్ గ్రాడ్ వద్ద రష్యా.. 91 వేలమంది జర్మన్‌ బలగాలను బంధించింది. ఇది రెండో ప్రపంచ యుద్ధ గతిని మార్చింది. ఈ స్టాలిన్‌ గ్రాడ్ ప్రస్తుత పేరే వొల్గొగ్రాడ్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని