Plane crash: విమానం అదృశ్యం కథ విషాదాంతం.. మలావీ ఉపాధ్యక్షుడు సహా 10 మంది దుర్మరణం

మలావీ ఉపాధ్యక్షుడు సౌలస్‌ షిలిమా సహా 10 మంది ప్రయాణిస్తున్న విమానం అక్కడి పర్వత ప్రాంతాల్లో కూలిపోయిందని ప్రభుత్వం ప్రకటించింది.

Updated : 11 Jun 2024 16:58 IST

బ్లాంటైర్‌: ఆఫ్రికా దేశమైన మలావీలో విమానం అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. అది పర్వత ప్రాంతాల్లో కూలిపోయిందని, ఈ ఘటనలో ఉపాధ్యక్షుడు సౌలస్‌ షిలిమా సహా 10 మంది దుర్మరణం చెందినట్లు ఆ దేశాధ్యక్షుడు లాజరస్‌ చక్వేరా వెల్లడించారు. గల్లంతైన విమానం శకలాలను గుర్తించామని.. అందులో ఎవరూ ప్రాణాలతో లేరని తెలిపారు.

మలావీ ఉపాధ్యక్షుడు, మరో తొమ్మిది మందిని తీసుకెళ్తున్న సైనిక విమానం జూన్‌ 10న అదృశ్యమైంది. రాజధాని లిలోంగ్వే నుంచి బయలుదేరిన ఆ విమానం 370 కిలోమీటర్ల దూరంలోని జుజు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. ప్రయాణ సమయం 45 నిమిషాలు. అయితే, ప్రతికూల వాతావరణం కారణంగా అక్కడ దిగవద్దని, తిరిగి లిలోంగ్వేకు వెళ్లిపోవాలని ఏటీసీ సూచించింది. ఈ క్రమంలోనే రాడార్‌తో విమానం సంబంధాలు తెగిపోయాయి.

తీరు మారని ముయిజ్జు: ఇటు భారత్‌లో పర్యటన.. అటు ఒప్పందాలపై దర్యాప్తు

గల్లంతైన విమానం కోసం మలావీ సైన్యం భారీ సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టింది. ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ వందల మంది సైనికులు, పోలీసులు, అటవీ అధికారులతో ముమ్మరంగా గాలించింది. పొరుగు దేశాల హెలికాప్టర్లు, డ్రోన్లను రంగంలోకి దించింది. అంగోలా దేశ అంతరిక్ష కేంద్రం సహాయాన్ని కోరింది. అమెరికా, బ్రిటన్‌, నార్వే, ఇజ్రాయెల్‌ కూడా సహాయం అందించేందుకు ముందుకువచ్చాయని మలావీ ప్రభుత్వం వెల్లడించింది. ఈ క్రమంలోనే కూలిపోయిన విమాన శకలాలను గుర్తించినట్లు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని