Donald Trump: కీలక రాష్ట్రాల్లో ట్రంప్‌నకు ఆధిక్యం.. ఒపీనియన్‌ పోల్‌లో బైడెన్‌ వెనకంజ!

Donald Trump: వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఇటీవల నిర్వహించిన ఒపీనియన్‌ పోల్‌లో బైడెన్‌ కంటే ట్రంప్‌ ముందంజలో ఉన్నట్లు తేలింది. కీలక రాష్ట్రాల్లో బైడెన్ పనితీరు పట్ల ఓటర్లు అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది.

Published : 04 Apr 2024 10:23 IST

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు (US Elections) సంబంధించి ఓ కీలక ఒపీనియన్‌ పోల్‌ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. కీలక రాష్ట్రాల్లో డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ కంటే రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌నకే (Donald Trump) మద్దతు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఏడు రాష్ట్రాల్లో సర్వే చేయగా ఆరు రాష్ట్రాల్లో ట్రంప్‌నకు ఆధిక్యం లభించనున్నట్లు తెలిసింది.

 బైడెన్‌ (Joe Biden) పనితీరుపై కొన్ని అంశాల్లో అసంతృప్తిగా ఉన్నట్లు ఓటర్లు తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ, ఉపాధి కల్పన వంటి సమస్యల పరిష్కారంలో ఆయన సామర్థ్యంపై సందేహం వ్యక్తం చేసినట్లు వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ నిర్వహించిన ఒపీనియన్‌ పోల్‌ తేల్చింది. ఆరు రాష్ట్రాల్లో ట్రంప్‌నకు ఆరు నుంచి ఎనిమిది పర్సంటేజీ పాయింట్ల ఆధిక్యం లభించినట్లు తెలిపింది. పెన్సిల్వేనియా, మిషిగన్‌, అరిజోనా, జార్జియా, నెవడా, ఉత్తర కరోలినా, విస్కాన్సిన్‌ రాష్ట్రాల్లో సర్వే నిర్వహించారు. ఎన్నికల ఫలితాలను ఈ రాష్ట్రాలే అత్యధికంగా ప్రభావితం చేస్తాయనే అంచనాలు ఉన్నాయి. ఒక్క విస్కాన్సిన్‌లో మాత్రమే ట్రంప్‌ కంటే బైడెన్‌ మూడు పాయింట్లతో ముందంజలో ఉన్నారు.

మేం చేసింది ఘోర తప్పిదమే

సర్వే జరిపిన అన్ని రాష్ట్రాల్లో బైడెన్‌ (Joe Biden) పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసినవారి కంటే అసంతృప్తిగా ఉన్నవారే అధికంగా ఉండడం గమనార్హం. అదే ట్రంప్‌ విషయంలో మాత్రం ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పనితీరు బాగుందని ఆరు రాష్ట్రాల్లోని ఓటర్లు అభిప్రాయపడ్డారు. ఒక్క అరిజోనాలో మాత్రమే ఆయనకు నెగెటివ్‌ మార్కులు వచ్చాయి.

మరోవైపు ప్రధాన పోల్స్‌ను నిరంతరం పర్యవేక్షించే ‘రియల్‌ క్లియర్‌ పాలిటిక్స్‌’ మాత్రం బైడెన్‌, ట్రంప్‌ మధ్య హోరాహోరీ పోటీ ఉండనుందని తెలిపింది. ప్రధాన పోల్స్‌ సగటు ఆధారంగా బైడెన్‌ కంటే ట్రంప్‌ 0.8 పర్సంటేజీ పాయింట్లతో ముందంజలో ఉన్నట్లు వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని