Tsunami Threat: సునామీ హెచ్చరిక.. తరలుతోన్న రాష్ట్రం.. బారులు తీరిన కార్లు

Eenadu icon
By International News Team Updated : 30 Jul 2025 12:37 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యాలోని కామ్చాట్కా ద్వీపకల్పంలో బుధవారం 8.8 తీవ్రతతో భారీ భూకంపం (Earthquake In Russia) సంభవించిన సంగతి తెలిసిందే. దీని ప్రభావంతో రష్యా, జపాన్‌ తీర ప్రాంతాలను సునామీ తాకింది. పలుచోట్ల రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి. వీటితో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు, దీవులకు సునామీ ముప్పు (Tsunami Threat) పొంచి ఉంది. అమెరికాలోని ద్వీప రాష్ట్రం హవాయి మొత్తానికి సునామీ హెచ్చరిక జారీ అయింది. అలలు ఆరు అడుగుల ఎత్తు వరకు ఎగసిపడుతున్నాయి.  

రాష్ట్రం మొత్తం సునామీ సైరన్లు వినిపించాయి. దాంతో పర్యాటకులు, స్థానికులు తమ స్వస్థలాలను వీడి ఎత్తైన ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఒక్కసారిగా రాష్ట్ర ప్రజలంతా తరలుతుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్లన్నీ కారులతో బారులు తీరాయి. ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇక అలస్కాలోని కొన్ని ప్రాంతాలను అమెరికా వాతావరణ విభాగం అప్రమత్తం చేసింది (Hawaii Evacuation).

ఒక్క అలగానే రాదు.. జాగ్రత్త..!

అమెరికా వాతావరణ విభాగం కీలక హెచ్చరిక జారీ చేసింది. సునామీ తీవ్రతను తేలిగ్గా తీసుకోవద్దని, ఫొటోల కోసం తీరానికి వెళ్లొద్దని చెప్పింది. ఒక్క అలతో సునామీ రాదని, అలలు పెద్దసంఖ్యలో వస్తాయని, సముద్రం నుంచి తీరానికి వచ్చే నీటి పరిమాణం భారీగా ఉంటుందని వెల్లడించింది. ఇదిలాఉంటే.. జపాన్‌ తీర ప్రాంతంలోని 9 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. చైనాకు ఈ ప్రకృతి విపత్తు ముప్పు పొంచి ఉంది. సునామీనే కాకుండా సైక్లోన్ ప్రమాదమూ ఉంది. దాంతో షాంఘైలోని 28 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విమానాలు, బోట్ సర్వీసులను నిలిపివేశారు. ప్రస్తుతం తూర్పు చైనాలో ఈదురుగాలులు, భారీ వర్షాలు కురుస్తున్నాయి.

రష్యా (Russia)లో తూర్పు ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున వచ్చిన భారీ భూకంపం కారణంగా దాంతోపాటు చుట్టుపక్కల దేశాలపై సునామీ అలలు విరుచుకుపడ్డాయి. అలలు తాకిన దీవుల్లో రష్యా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ సునామీ వల్ల ఆయా ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. పలు నిర్మాణాలు దెబ్బతిన్నాయి. 


Tags :
Published : 30 Jul 2025 11:47 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు