ఆ దృశ్యాలు చూస్తే గుండె తరుక్కుపోతోంది.. ఇజ్రాయెల్‌పై అగ్రరాజ్యం ఆగ్రహం!

Israel-Hamas Conflict: రఫాలో ఇజ్రాయెల్‌ చేస్తున్న దాడులను అమెరికా ఖండించింది. ఆదివారం నాటి దాడి దృశ్యాలు కలచివేసేలా ఉన్నాయని తెలిపింది. సామాన్య పౌరులకు ఎలాంటి హాని జరగకుండా చూసుకోవాలని ఇజ్రాయెల్‌ను కోరింది.

Updated : 29 May 2024 08:29 IST

Israel-Hamas Conflict | వాషింగ్టన్‌: రఫాలో ఇజ్రాయెల్‌ (Israel) ఆదివారం జరిపిన దాడులను అగ్రరాజ్యం అమెరికా ఖండించింది. మహిళలు, పిల్లలు సహా పెద్ద ఎత్తున మరణాలు సంభవించడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. దాడి దృశ్యాలు కలచివేసేలా ఉన్నాయని పేర్కొంది.

‘‘రఫాలో ఇజ్రాయెల్‌ రక్షణ దళాలు (IDF) జరిపిన దాడుల్లో పదుల సంఖ్యలో సామాన్య పౌరులు మరణించిన దృశ్యాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. అవన్నీ చూస్తుంటే హృదయం తరుక్కుపోతోంది. చాలా భయానకంగా ఉన్నాయి. హమాస్‌తో జరుగుతున్న ఈ పోరులో సామాన్యులకు ఎలాంటి హాని జరగొద్దు. హమాస్‌కు బుద్ధిచెప్పే హక్కు ఇజ్రాయెల్‌కు ఉంది. అయినప్పటికీ.. అది సామాన్య పౌరులకు ఎలాంటి ముప్పు తలపెట్టొద్దు. అందుకోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. హమాస్‌ పెద్ద తలకాయల్ని లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిగింది. అదే సమయంలో పౌరుల ప్రాణాలు కూడా ముఖ్యమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి’’ అని శ్వేతసౌధంలోని జాతీయ భద్రతా మండలి వ్యూహాత్మక సమాచార విభాగం సమన్వయకర్త జాన్‌ కిర్బీ అన్నారు.

పాలస్తీనాను గుర్తిస్తున్నాం: స్పెయిన్, నార్వే, ఐర్లాండ్‌

రఫాలో భూతల దాడులు అవసరం లేదని తాము భావిస్తున్నామని కిర్బీ వెల్లడించారు. దీనిపై నిరంతరం ఇజ్రాయెల్‌తో చర్చలు జరుపుతున్నామని.. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని వెల్లడించారు. మరోవైపు రఫాలో ఇజ్రాయెల్‌ దాడి తర్వాత కూడా ఆ దేశం పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విధానంలో ఎలాంటి మార్పూ లేదని శ్వేతసౌధం స్పష్టం చేసింది. దీంతో ఇజ్రాయెల్‌ విషయంలో అమెరికా నిర్దేశించుకున్న హద్దులు ఇంకా ఆ దేశం మీరలేదనే విషయం వెల్లడవుతోందని నిపుణులు విశ్లేషించారు.

రఫాలో ఆదివారం రాత్రి ఇజ్రాయెల్‌ భీకర దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 45 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 200 మందికిపైగా గాయపడ్డారు. ఇప్పటి వరకు గాజా పోరులో అత్యంత పాశవికమైన దాడుల్లో ఒకటిగా దీన్ని పేర్కొంటున్నారు. దాడి జరిగిన తల్‌ అల్‌ సుల్తాన్‌ ప్రాంతాన్ని సురక్షితమైనదిగా ఇజ్రాయెలే ప్రకటించింది. దీంతో చాలా మంది ఇక్కడకు వచ్చి తలదాచుకుంటున్నారు. ఇప్పుడు ఆ ప్రాంతంపైనే దాడి చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అయినప్పటికీ.. ఇజ్రాయెల్‌ దాడుల్లో సోమవారం రాత్రి, మంగళవారం మరో 37 మంది పాలస్తీనీయన్లు మృతి చెందడం గమనార్హం.

గాజాలో సంక్షోభం తారస్థాయికి చేరిన వేళ, పాలస్తీనాను స్వతంత్ర దేశంగా మంగళవారం నుంచి అధికారికంగా గుర్తిస్తున్నట్లు స్పెయిన్, నార్వే, ఐర్లాండ్‌ ప్రకటించాయి. పాలస్తీనీయన్లు, ఇజ్రాయెలీలు శాంతిని సాధించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని మంగళవారం స్పెయిన్‌ ప్రధాని పెడ్రో శాంచెజ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని