China: కొత్త వైరస్‌ లేదు.. అవి సీజనల్‌ నిమోనియా సమస్యలే..: చైనా

చైనాలో అంతుచిక్కని నిమోనియాలో సరికొత్త వైరస్‌ ఏమీ లేదని అక్కడి ప్రభుత్వం ఓ అంచనా కొచ్చింది. ఇదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందించిన నివేదికలో పేర్కొంది.

Updated : 26 Nov 2023 11:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనాలోని చిన్నారుల్లో ఒక్కసారిగా వ్యాపించిన నిమోనియాపై తమకు నివేదిక అందిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. అవి శీతాకాలంలో వచ్చే సాధారణ శ్వాసకోశ సమస్యలే అని బీజింగ్‌ పేర్కొందని వెల్లడించింది. బాధితుల్లో ఎటువంటి సరికొత్త వైరస్‌ లేదని వివరణ ఇచ్చినట్లు చెప్పింది. ఈ విషయాన్ని చైనాలోని సీజీటీఎన్‌ కథనంలో పేర్కొంది. చైనాలో శరవేగంగా వ్యాపించిన శ్వాసకోశ సమస్యపై ప్రపంచ ఆరోగ్య సంస్థకు కేవలం 24 గంటల్లోనే కచ్చితమైన సమాచారం అందించిందని సీజీటీఎన్‌ వెల్లడించింది. బీజింగ్‌, లియోనోంగ్‌లో చేసిన పరీక్షల్లో ఎటువంటి కొత్త వైరస్‌ను గుర్తించలేదని పేర్కొంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ గురువారం చైనీస్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ను సంప్రదించింది. బీజింగ్‌ పిల్లల ఆస్పత్రిని కూడా సమాచారం కోరింది. దీనిపై ఆస్పత్రి శ్వాసకోశ విభాగం డైరెక్టర్‌ ఝావో షన్నియింగ్‌ మాట్లాడుతూ.. ‘‘మేము సీడీసీ నుంచి పొందిన డేటా ప్రకారం మైకోప్లాస్మాలో ఎటువంటి మార్పు లేదు. రోగులకు చికిత్సలో సంక్లిష్టతలు ఏమీ రాలేదు. మైకోప్లాస్మా నిమోనియా చైనాలో చాలా ఏళ్ల నుంచి ఉనికిలో ఉంది. దీనికి కచ్చితమైన రోగ నిర్ధారణ లేదు. కానీ, మాకు ఈ చికిత్సలో చాలా అనుభవం ఉంది. ప్రారంభ దశలోనే చికిత్సను అందిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు’’ అని పేర్కొన్నారు.

హమాస్‌ చెరలోని మరో 13 మంది బందీలకు విముక్తి

ఇక బీజింగ్‌లోని ది క్యాపిటల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పిడియాట్రిక్స్‌లో చేరుతున్న చిన్నారుల సంఖ్య పెరిగింది. దీంతో రెండో వార్డును కూడా ప్రారంభించారు. బీజింగ్‌లోని చాలా ఆస్పత్రుల్లో ఇలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకొన్నారు. మళ్లీ మాస్కుల వినియోగం, భౌతిక దూరం పాటించాలని చైనా ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. 

చైనాలో పాఠశాలలకు వెళుతున్న చిన్నారులు కొన్నాళ్లుగా అంతుచిక్కని నిమోనియా లక్షణాల బారిన పడుతున్నారు. ఈ విషయంపై ప్రపంచవ్యాప్తంగా వ్యాధుల వ్యాప్తిని పరిశీలించే ప్రోమెడ్‌ సంస్థ తొలుత అప్రమత్తం చేసింది. ఈ మేరకు ఓ నివేదికను ఇటీవల సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది.‘‘బుధవారం ఉదయం అనారోగ్యానికి గురైన చిన్నారులతో బీజింగ్‌, లియనోనింగ్‌ ప్రాంతాల్లోని ఆస్పత్రులు నిండిపోయాయి. దగ్గు లేకపోయినా ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌, శ్వాససంబంధ ఇబ్బందులు, జ్వరం వంటి లక్షణాలతో చిన్నారులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. దీంతో ఈ అంతు చిక్కని నిమోనియా రకం వ్యాప్తి చెందకుండా పాఠశాలలను యాజమాన్యాలు తాత్కాలికంగా మూసివేశాయి’’ అని ప్రోమెడ్‌ సంస్థ ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు చేసింది.  పలువురు ఉపాధ్యాయులు కూడా ఈ ఇన్‌ఫెక్షన్‌ బారిన పడినట్లు వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని