
తాజా వార్తలు
భార్యపై అనుమానంతో.. కరోనా మందని విషమిచ్చాడు
పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు
దిల్లీ: భార్యపై అనుమానంతో ఓ ప్రబుద్ధుడు చేసిన నిర్వాకం అతడిని జైలుపాలు చేసింది. దేశరాజధాని దిల్లీలో చోటుచేసుకున్న ఈ ఘటన విస్తుపోయే నిజాల్ని బయటపెట్టింది. ఇప్పటికే దిల్లీలో కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన ప్రతీకారాన్ని తీర్చుకోడానికి ఆ వ్యక్తి.. కరోనా వైరస్ను అవకాశంగా మార్చుకున్నాడు. అలీపూర్కు చెందిన ప్రదీప్(42).. తన భార్యకు ఓ హోమ్గార్డ్తో సంబంధముందని అనుమానించాడు. దీంతో ఆ హోమ్గార్డ్ కుటుంబాన్ని అంతమొందించాలని భావించి ఇద్దరు మహిళలను నియమించుకున్నాడు. ఆదివారం వారిని ఆరోగ్య కార్యకర్తల్లా హోమ్గార్డ్ ఇంటికెళ్లమని చెప్పి, కరోనా వైరస్కు నివారణ మందు ఇస్తున్నట్లు నమ్మించాడు. విషం కలిపిన ఓ బాటిల్ను ఆ మహిళలు హోమ్గార్డ్ కుటుంబసభ్యులకు ఇవ్వడంతో.. ఆ ఇంట్లోని ముగ్గురూ అది తాగి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై సమీపంలోని ఆస్పత్రికెళ్లడంతో బతికి బయటపడ్డారు. కేసు విచారణ చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఇద్దరు మహిళల్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ప్రదీప్ తమకు డబ్బులు ఇచ్చి ఇలా చేయమని చెప్పాడని మహిళలు విచారణలో చెప్పడంతో అతడ్ని అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు.