icon icon icon
icon icon icon

జనం మనసు దోచుకున్న జనసేన.. అత్యధిక స్థానాల్లో గెలుపుపై ధీమా

ఎన్నికల్లో పోటీ చేసిన 2 లోక్‌సభ స్థానాల్లోనూ గెలుపు సాధ్యమని జనసేన అంచనా వేసింది. 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయగా 18 చోట్ల గెలుపు తథ్యమని, 3 చోట్ల గట్టిపోటీ ఉందని పార్టీ అంతర్గత అంచనాలు పేర్కొంటున్నాయి.

Updated : 14 May 2024 11:11 IST

ఈనాడు, అమరావతి: ఎన్నికల్లో పోటీ చేసిన 2 లోక్‌సభ స్థానాల్లోనూ గెలుపు సాధ్యమని జనసేన అంచనా వేసింది. 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయగా 18 చోట్ల గెలుపు తథ్యమని, 3 చోట్ల గట్టిపోటీ ఉందని పార్టీ అంతర్గత అంచనాలు పేర్కొంటున్నాయి. పోలింగు పూర్తయ్యాక పరిస్థితుల్ని విశ్లేషించి, క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా పార్టీ వర్గాలు ఈ లెక్కలు వేశాయి. ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని సమాచారం. పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ పోటీ చేసిన పిఠాపురంలో మెజారిటీ ఎంత వస్తుందనే దానిపై అంచనాలు వేసుకుంటున్నారు. భారీ మెజారిటీ వస్తుందనే ధీమాతో పార్టీ శ్రేణులు ఉన్నాయి. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ బరిలో నిలిచిన తెనాలిలోనూ గెలుపు ఖాయంగా మారింది. అక్కడ వైకాపా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ వ్యవహరించిన తీరు సంచలనమైంది. ఆయన పోలింగ్‌ కేంద్రంలో ఓటరును కొట్టడంతో నియోజకవర్గంలో వైకాపాకు మరింత ప్రతికూల పరిస్థితి ఏర్పడింది. పాలకొండ, పోలవరం వంటి ఎస్టీ రిజర్వు నియోజకవర్గాల్లో జనసేన పోటీకి దిగింది. తొలుత అక్కడ గట్టి పోటీ కనిపించినా చివరకు రెండు స్థానాల్లోనూ పార్టీకి సానుకూల వాతావరణం ఏర్పడింది. రాజోలులో జనసేనకు మద్దతు ఏకపక్షంగా లభించిందని క్షేత్రస్థాయి సమాచారం. గన్నవరంలో కొంతమేర పోటీ ఎదురైందని చెబుతున్నారు. రాజానగరంలో తొలుత గట్టిపోటీ ఉంటుందని భావించినా చివరకు సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో జనసేన పోటీ చేసిన ప్రతి స్థానంలోనూ గెలుస్తుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నారు. నెల్లిమర్లలో తొలుత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా క్రమేణా అభ్యర్థి మాధవి... తెదేపా శ్రేణులతో కలిసి పని చేయడం, ఆ పార్టీ ఇన్‌ఛార్జి పూర్తిస్థాయిలో సహకరించడం కలిసొచ్చింది. ప్రస్తుత సమాచారం ప్రకారం పి.గన్నవరం, రైల్వేకోడూరు, తిరుపతి శాసనసభ నియోజకవర్గాల్లో ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురైందని సమాచారం. వీటిలో కొద్ది మెజారిటీతోనైనా బయటపడతామనే ధీమాతో పార్టీ వర్గాలు ఉన్నాయి.

రెండుచోట్లా జయకేతనమే...

మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గంలో పూర్తి అనుకూల పరిస్థితులున్నాయని అంచనా. కాకినాడ లోక్‌సభ స్థానంలో కొంతమేర క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్లు తెలిసింది. కాకినాడ గ్రామీణ, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన బరిలో నిలవడం, పార్టీ అధినేత పిఠాపురంలో పోటీ చేయడం ఇక్కడ లోక్‌సభ అభ్యర్థికి అనుకూలాంశాలయ్యాయి. సామాజికవర్గంతో పాటు తెదేపా, భాజపా పొత్తు ఈ లోక్‌సభ నియోజకవర్గంలో జనసేనకు సానుకూలమైంది. అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ క్యాడర్‌, యువత ఎంతో ఉత్సాహంగా పనిచేశారు. కూటమి మద్దతు ఇచ్చిన అనేక నియోజకవర్గాల్లో తెదేపా, భాజపా అభ్యర్థులకు జనసేన యువత అండగా నిలిచారు. కొన్నిచోట్ల ఇబ్బంది పెడుతున్న ప్రత్యర్థులను క్యాడర్‌ గట్టిగా ఢీకొంది. పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ పోలింగ్‌ తర్వాత చాలా ఉత్సాహంగా ఉన్నారని సమాచారం.


తీర్పు అద్భుతంగా ఉండబోతోంది

నాదెండ్ల మనోహర్‌

తెనాలి (కొత్తపేట), న్యూస్‌టుడే: ‘ఓటర్ల తీర్పు అద్భుతంగా ఉండబోతోంది. వైకాపా పాలన పోవాలని, జనసేన, తెదేపా, భాజపా కూటమి ప్రభుత్వం రావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకునేందుకు జనం బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకోవడం స్ఫూర్తిదాయకం. మాట ఇచ్చినట్లుగా ప్రజలు కోరుకున్న రీతిలో సంక్షేమం, అభివృద్ధితో ముందుకు వెళ్తాం. గుంటూరు జిల్లా తెనాలిలోని బాలికోన్నత పాఠశాలలో ఓటు వేశా’ అని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img