Adani: అదానీ తదితరులపై లంచాల కేసులన్నీ ఒకే జడ్జి పరిధిలోకి

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 04 Jan 2025 06:41 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

న్యూయార్క్‌ కోర్టు నిర్ణయం

ఈనాడు, అమరావతి: విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల ద్వారా అనుచిత లబ్ధి పొందేందుకు భారీగా లంచాలు చెల్లించారన్న అభియోగాలపై ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీ, అజూర్‌ పవర్‌ సంస్థ పూర్వ గ్లోబల్‌ డైరెక్టర్‌ సిరిల్‌ కేబనీస్‌ తదితరులపై అమెరికాలో దాఖలైన క్రిమినల్, సివిల్‌ కేసుల విచారణను ఒకే జడ్జికి అప్పగిస్తూ న్యూయార్క్‌ ఈస్ట్రన్‌ డిస్ట్రిక్ట్స్‌ కోర్టు ఆదేశాలు జారీచేసింది. మూడు కేసులూ ఒకే అంశానికి సంబంధించినవి కాబట్టి.. క్రిమినల్‌ కేసు విచారిస్తున్న యునైటెడ్‌ స్టేట్స్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి నికొలాస్‌ గరౌఫిస్‌కే వాటన్నింటి విచారణను అప్పగించినట్టు పీటీఐ వార్తా సంస్థ శుక్రవారం వెల్లడించింది. అధిక ధరలకు విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు చేసుకునేలా అంగీకరింపజేసేందుకు అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌కు రూ.1,750 కోట్లు ఇవ్వజూపారన్నది గౌతమ్‌ అదానీ, సిరిల్‌ కేబనీస్‌ తదితరులపై అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ (ఎస్‌ఈసీ), అమెరికా దర్యాప్తు సంస్థలు మోపిన అభియోగం. తప్పుడు సమాచారంతో అమెరికాలో నిధులు సమీకరించి, దాన్ని లంచాలకు వెచ్చించారన్నది ఆరోపణ.

జగన్‌తో పాటు మరికొన్ని రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, అధికారులకూ లంచాలు అందాయని అమెరికా దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. ఫారిన్‌ కరప్ట్‌ ప్రాక్టీసెస్‌ యాక్ట్‌ (ఎఫ్‌సీపీఏ)ని ఉల్లంఘించారని, సెక్యూరిటీల కుంభకోణానికి పాల్పడ్డారని గౌతమ్‌ అదానీ, సిరిల్‌ కేబనీస్‌ సహా 8 మందిపై న్యూయార్క్‌ ఈస్ట్రన్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టులో అమెరికా ‘డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌’ క్రిమినల్‌ కేసు నమోదు చేసింది. తప్పుడు సమాచారమిచ్చి నిధులు సమీకరించారంటూ గౌతమ్‌ అదానీ, సాగర్‌ అదానీలపైనా, ఎఫ్‌సీపీఏ చట్టాన్ని ఉల్లంఘించారంటూ సిరిల్‌ కేబనీస్‌పైనా ఎస్‌ఈసీ వేర్వేరుగా సివిల్‌ కేసులు దాఖలు చేసింది. ఆ కేసులన్నింటికీ మూలం, జరిగిన లావాదేవీలు, చోటుచేసుకున్న పరిణామాలు ఒకటే కాబట్టి.. వాటిని కలిపి విచారించాలని ఎస్‌ఈసీ ఇటీవల న్యూయార్క్‌ ఈస్ట్రన్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టుకు పిటిషన్‌ సమర్పించింది. ఆ నేపథ్యంలో ఆ కేసుల విచారణను ఒకే జడ్జికి అప్పగిస్తూ న్యూయార్క్‌ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Tags :
Published : 04 Jan 2025 04:36 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు