Kolusu Parthasarathy: విషపూరిత మద్యంతో ప్రజల ప్రాణాలు తీశారు

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 04 Aug 2025 05:28 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

మంత్రి కొలుసు పార్థసారథి ధ్వజం

ఈనాడు, అమరావతి: మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తును దాచిపెట్టిన డెన్‌లు, డంప్‌ల దృశ్యాలు చూస్తుంటే.. వైకాపా ప్రభుత్వ హయాంలో ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ఎన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నారో కళ్లముందు కనిపిస్తోందని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఇలా లూటీ చేసిన డబ్బుతో ఈ మద్యం ముఠా టన్నులకొద్దీ బంగారం కొనడంతోపాటు విదేశాల్లో మైనింగ్‌ వ్యాపారం చేసిందని, దుబాయ్‌లో డొల్ల కంపెనీలు ఏర్పాటుచేసుకుందని ఆరోపించారు. ఈ ముడుపుల సొమ్మునే గత సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులకు పంపిణీ చేసి.... అడ్డదారుల్లో గెలిచేందుకు విశ్వప్రయత్నాలు చేసిందన్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు.

  • మద్యపాన నిషేధం అమలు చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన వైకాపా.. ఆ హామీని అడ్డం పెట్టుకుని కనీవినీ ఎరుగని రీతిలో మద్యం కుంభకోణానికి పాల్పడి రూ.వేల కోట్లు దోచుకుంది. ముడుపుల కోసం ఊరూపేరూ లేని ‘జే’ బ్రాండ్లు అమ్మి.. ప్రజల ధన, మాన, ప్రాణాలతో చెలగాటమాడింది. వైకాపా హయాంలోని ఐదేళ్లలో ‘జే’ బ్రాండ్లు తాగడం వల్ల 30వేల మంది చనిపోయినట్లు సర్వేల్లో వెల్లడైంది. ఇంతటి దారుణాలు గతంలో ఏ ప్రభుత్వ హయాంలోనూ జరగలేదు.
  • మద్యం ధరలు పెంచి.. వినియోగదారులపై తీవ్ర ఆర్థికభారం మోపారు. విషపూరిత రసాయనాలు కలిసిన మద్యాన్ని అధిక ధరలకు విక్రయించారు. త్రిబుల్‌ ఎక్స్, త్రిబుల్‌ ఆర్, బూమ్‌ బూమ్‌ లాంటి బ్రాండ్లను తెచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు. విషపూరిత మద్యం తాగలేక గంజాయికి బానిసై 1,700 మంది యువకులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జే బ్రాండ్ల మద్యం తాగడం వల్ల కిడ్నీ, కాలేయ వ్యాధుల బారినపడిన యువత ఇప్పటికీ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు.
  • కూటమి అధికారంలోకి వచ్చాక తెచ్చిన నూతన మద్యం విధానంతో పొరుగు రాష్ట్రాల్లో మద్యం విక్రయాలు తగ్గాయి. ఏపీలో ప్రస్తుతం నాణ్యమైన మద్యం లభిస్తుండడంతో ఇతర రాష్ట్రాల నుంచి దొంగచాటుగా మద్యం తీసుకొచ్చే పరిస్థితికి అడ్డుకట్ట పడింది.
Tags :
Published : 04 Aug 2025 04:06 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు