Polavaram: గాడినపడిన పోలవరం ప్రాజెక్టు

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 31 Mar 2025 09:45 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలల్లోనే 6% పనులు
జగన్‌ హయాం ఐదేళ్లలో చేసింది 11.58 శాతమే
వరదల్లోనూ పనులు చేసేలా ఏర్పాట్లు 
సీపేజి నియంత్రణకు బట్రస్‌ డ్యాం నిర్మాణం 
డీ వాల్‌ నిర్మాణ పనుల కొనసాగింపునకు ప్లాట్‌ఫాం
ఈనాడు, అమరావతి, ఏలూరు. న్యూస్‌టుడే, పోలవరం

పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే చిత్రం

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గాడిలో పడింది. అనేక సాంకేతిక సవాళ్లకు పరిష్కారాలు వెతికి.. ముందడుగు వేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొమ్మిది నెలల కాలంలో ప్రాజెక్టు మొత్తం మీద 6.11% పనులు చేశారు. జగన్‌ హయాం గత ఐదేళ్లలో ప్రాజెక్టులో 11.58% పనులు మాత్రమే చేయగలిగారు. కూటమి ప్రభుత్వంలో తొమ్మిది నెలల్లోనే అందులో సగం మేర చేయడం విశేషం. ప్రధాన డ్యాంలో 3.80% భూసేకరణ, పునరావాసానికి సంబంధించి 2.56% మేర పురోగతి సాధించారు.

బెంటోనైట్‌ ప్లాంటు చెంత చేపట్టిన నిర్మాణాలు

సాంకేతిక సవాళ్లకు పరిష్కారం

కూటమి ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక సమస్యలకు పరిష్కారాలు కనుగొన్నారు. విదేశీ నిపుణుల కమిటీని కేంద్ర జల్‌శక్తి, కేంద్ర జలసంఘం కలిపి నియమించాయి. దేశ, విదేశాలకు చెందిన నిపుణులు కలిసి ప్రాజెక్టును సందర్శించారు. 

మేధోమథనం చేసి, ఎలా ముందుకు వెళ్లాలన్న అంశాలను కొలిక్కి తీసుకొచ్చారు. ఇందులో భాగంగానే కొత్తగా డయాఫ్రం వాల్‌ నిర్మాణం ప్రారంభమైంది. 2025 జనవరిలో డీ వాల్‌ నిర్మాణం ప్రారంభించారు. మొత్తం 1,396 మీటర్ల మేర దీన్ని నిర్మించాల్సి ఉంది. ఇంతవరకు 158.20 మీటర్ల మేర పనులు చేపట్టారు. యంత్ర సామగ్రిని పెంచి.. ఈ పనుల్లో మరింత వేగం పెంచాల్సి ఉంది.

జలవిద్యుత్తు కేంద్రం వద్ద కొనసాగుతున్న పనులు

వర్షాలు, వరదల సవాళ్లను ఎదుర్కొనేందుకు..

పోలవరంలో ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంలు నిర్మించినా.. వాటి సీపేజి వల్ల ప్రధాన డ్యాం ప్రాంతంలో నీరు నిండిపోతోంది. ఈ సమస్యతో పనులు చేయడం సవాల్‌గా మారింది. వర్షాలకు ముందు ఏప్రిల్, మే, జూన్‌ వరకు పనులు వేగంగా చేసేందుకు ఆస్కారం ఉంటుంది. జులై నుంచి గోదావరిలో వరదలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో ఎగువ కాఫర్‌ డ్యాం సీపేజిని నియంత్రించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు కొత్తగా బట్రస్‌ డ్యాం నిర్మాణాన్ని ప్రారంభించారు. దాదాపు రూ.82 కోట్ల విలువతో ఈ పనులు చేపట్టారు. వర్షాకాలం లోపు ఈ కట్టడాన్ని పూర్తిచేయాలి. బట్రస్‌ డ్యాం నిర్మిస్తే ఎగువ కాఫర్‌ డ్యాం పునాదుల నుంచి వచ్చే సీపేజిని నియంత్రించొచ్చనేది వ్యూహం. దీనికితోడు డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి సీపేజి జలాలు ఆటంకం కలగకుండా ప్లాట్‌ఫాం నిర్మిస్తున్నారు. ఆ ప్లాట్‌ఫాంపై మిషనరీ ఉంచి పనులను కొనసాగిస్తారు. వరదల సమయంలోనే పనులు కొనసాగిస్తూ 2025 డిసెంబరు నాటికి డయాఫ్రం వాల్‌ పూర్తి చేయాలనేది లక్ష్యం. బట్రస్‌ డ్యాం నిర్మాణంలో మొత్తం 7.50 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర పనిచేయాలి. ప్రస్తుతం 50 వేల క్యూబిక్‌ మీటర్ల మేర పూర్తయింది.

డయాఫ్రంవాల్‌ నిర్మాణ ప్రాంతంలో పాతిన జెండాలు

పోలవరం పరుగులు

జనవరి 18న డయాఫ్రంవాల్‌ పనులు మొదలయ్యాయి. ఇందులో భాగంగా 389 ప్రైమరీ, సెకండరీ ప్యానల్స్‌ను నిర్మించాల్సి ఉంది. ఇప్పటికి 28 ప్రైమరీ ప్యానల్స్‌ను నిర్మించారు. ఈ ఏడాది డిసెంబరునాటికి డయాఫ్రంవాల్‌ను నిర్మించేలా పనులు కొనసాగుతున్నాయి. జూన్‌-అక్టోబరు మధ్య వచ్చే వరదల కారణంగా పనులు ఆగకుండా ఉండేలా ఎగువ కాఫర్‌డ్యాంను ఆనుకుని సమాంతరంగా బట్రస్‌ డ్యాం నిర్మిస్తున్నారు. దీంతోపాటు జల విద్యుత్తు కేంద్రం పనులు చేపట్టారు. బెంటోనైట్‌ ప్లాంటు వద్ద కూడా పనులు జోరందుకున్నాయి. వైబ్రో కాంప్రెక్షన్‌ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.

బట్రస్‌ డ్యాం పనులు

ప్రధాన డ్యాం నిర్మాణమే కీలకం

డీ వాల్‌ పూర్తయిన తర్వాత ప్రధాన రాతి, మట్టికట్ట నిర్మించాల్సి ఉంటుంది. డీ వాల్‌ నిర్మాణం కొంత పూర్తయిన వెంటనే గ్యాప్‌-2 ప్రధాన డ్యాం నిర్మించాలనేది వ్యూహం. ప్రస్తుతం గ్యాప్‌-1 ప్రధాన డ్యాం నిర్మాణ ఆకృతులను సమర్పిస్తున్నారు. దీనికి అవసరమైన మట్టి, రాతి మెటీరియల్‌ సిద్ధం చేశారు. ఏప్రిల్‌ రెండో వారంలోనే మొదటి గ్యాప్‌ ప్రధాన డ్యాం పనులు ప్రారంభించి, 2026 మార్చికి పూర్తి చేయాలనేది లక్ష్యం. గ్యాప్‌-2 ప్రధాన డ్యాం నిర్మాణం డీ వాల్‌ నిర్మాణంపై ఆధారపడి ఉంది. ఇక్కడ ప్రధాన డ్యాం పనులు 2025 నవంబరు నుంచి ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. అందుకుతగ్గ పరీక్షలు, విశ్లేషణలు పూర్తి చేస్తున్నారు. వీటితోపాటు కుడి, ఎడమ కాలువల అనుసంధాన పనులూ పట్టాలకెక్కించారు. వీటిని 2026 జూన్‌ నాటికి పూర్తి చేసేలా లక్ష్యం నిర్దేశించారు.

​​​​


Tags :
Published : 31 Mar 2025 05:37 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు