ప్రభుత్వ నిర్ణయంతో ఆదివాసీలకు అన్యాయం

బోయ, వాల్మీకులను ఎస్టీ జాబితాల్లో చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల శాసనసభలో చేసిన తీర్మానంపై ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

Published : 30 Mar 2023 04:42 IST

బోయ, వాల్మీకులను ఎస్టీల్లో  చేర్చే తీర్మానం రద్దుచేయాలి
ఎస్టీ ప్రజా ప్రతినిధులంతా రాజీనామా చేయాలి
గిరిజన సంఘాల డిమాండ్‌
31న మన్యం బంద్‌కు పిలుపు

ఈనాడు డిజిటల్‌, అనకాపల్లి - న్యూస్‌టుడే, పాడేరు: బోయ, వాల్మీకులను ఎస్టీ జాబితాల్లో చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల శాసనసభలో చేసిన తీర్మానంపై ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ తీర్మానాన్ని వెంటనే రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఆదివాసీ ప్రాంతంలో దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గిరిజన చట్టాలు, హక్కులను హరించేలా సర్కారు నిర్ణయాలు ఉంటున్నాయని గిరిజన సంఘాల నాయకులు మండిపడుతున్నారు. గత నాలుగు రోజులుగా ఏజెన్సీలో నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలతో ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యేలకు తమ ఆందోళనను తెలియజేస్తున్నారు. ఈ నెల 31న రాష్ట్రవ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంత బంద్‌ చేయాలని నిర్ణయించారు. రాజకీయ ప్రయోజనాల కోసం తమ బతుకులతో చెలగాటం ఆడవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. తీర్మానాన్ని వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

* 1/70 భూబదలాయింపు చట్టాన్ని కాదని పంప్డ్‌ స్టోరేజి ప్రాజెక్టుల పేరుతో షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌, అదానీ సంస్థలకు వందల ఎకరాలు కట్టబెట్టడంపై  ఇప్పటికే స్థానిక గిరిజనులు ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వ తాజా తీర్మానంతో నిరసనలు తీవ్ర మయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎస్టీ జనాభా 27 లక్షల వరకు ఉన్నారు. వీరిలో సుమారు 20 లక్షల మంది షెడ్యూల్డ్‌ ప్రాంతంలో నివసిస్తున్నారు. మిగతా ఏడు లక్షల మంది మైదాన ప్రాంతాల్లో ఉంటున్నారు. వీరికి అదనంగా ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా నివసించే బోయవాల్మీకులను గిరిజన తెగలోకి చేర్చాలని ప్రభుత్వం అసెంబ్లీలో ఇటీవల తీర్మానం చేసింది. దీనివల్ల విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలలో తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. కొత్తగా వచ్చిన వారు ఆర్థిక, రాజకీయపరమైన చైతన్యంతో తమపై పెత్తనం చెలాయిస్తారని భయపడుతున్నారు. ఎస్టీ తెగలకు ప్రస్తుతం అమలుచేస్తున్న ఆరు శాతం రిజర్వేషన్‌ కొత్తగా చేరే వారికి బదలాయింపు జరిగి.. పీసా, 1/70 చట్టం ఇతర చట్టాలు బలహీనపడే ప్రమాదముందని గిరిజన సంఘాల నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అరకులోయ, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల పరిధిలోని అన్నిచోట్లా గిరిజనులు, ఉద్యోగ సంఘాల నాయకులు నిరసన తెలుపుతున్నారు. అధికార వైకాపా ఎమ్మెల్యేల ఫ్లెక్సీలను చించేశారు.. కొన్నిచోట్ల నిప్పుపెట్టారు. ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 


గిరిజనులకు నష్టం

‘పురాతన జీవన విధానం, ప్రత్యేకమైన సంస్కృతి, వెనుకబాటుతనం వంటి లక్షణాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సామాజిక భద్రతా శాఖ గతంలో షెడ్యూల్‌ తెగలను గుర్తించింది. అలాంటి పరిశీలనలేవీ జరగకుండా సీఎం జగన్‌ ఓ విశ్రాంత ఐఏఎస్‌ అధికారి నేతృత్వంలో ఏకసభ్య కమిటీ వేసి, గిరిజనుల అభిప్రాయాలు తెలుసుకోకుండా ఏకపక్షంగా బోయ, వాల్మీకులను ఎస్టీల్లో చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాజకీయ ప్రయోజనం కోసం ఈ వివాదాస్పద అంశాన్ని తెరపైకి తెచ్చారు’.

అప్పలనర్స, జాతీయ కార్యవర్గ సభ్యుడు, గిరిజన సంఘం


అండగా నిలిచినందుకా ఈ వెన్నుపోటు?

‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన గిరిజన సలహా మండలిలో భవిష్యత్‌లో ఏ కులాలను ఎస్టీల్లో చేర్చరాదని తీర్మానించారు. అందుకు విరుద్ధంగా ముఖ్యమంత్రి జగన్‌ వ్యవహరిస్తున్నారు. గిరిజనేతరులను ఎస్టీలో చేర్చితే షెడ్యూల్డ్‌ ప్రాంతం మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. విద్య, ఉద్యోగ, రాజకీయ ప్రయోజనాలు పూర్తిగా దెబ్బతింటాయి. వైఎస్‌ కుటుంబానికి ఆదివాసులంతా అండగా నిలిచినందుకా ఈ వెన్నుపోటు?. ఈ తీర్మానాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం ఆగదు’.

 రామారావుదొర, కన్వీనర్‌, ఆదివాసీ ఐకాస, అల్లూరి సీతారామరాజు జిల్లా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని