అరాచకాన్ని కప్పిపుచ్చేందుకు ప్రభుత్వ కుయుక్తి

వైకాపాతో అంటకాగుతున్నారని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కడప డీఎస్పీ షరీఫ్‌ మరోసారి ఆ పార్టీకి నిస్సిగ్గుగా వత్తాసు పలికారు. అధికారపార్టీ అరాచకాన్ని కప్పిపుచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేశారు.

Updated : 25 Mar 2024 07:45 IST

సుబ్బారావు కుటుంబం ఆత్మహత్యకు.. వ్యక్తిగత అంశాలే కారణమట!
వారికి భూమి సంబంధిత సమస్య లేనే లేదన్న డీఎస్పీ షరీఫ్‌
క్రికెట్‌ బెట్టింగ్‌, చెడు అలవాట్ల వల్లే అప్పుల పాలయ్యారని వక్రభాష్యం
వారి సూసైడ్‌ నోట్‌లోని అంశాలనూ పక్కదారి పట్టించిన వైనం
నిస్సిగ్గుగా అధికార వైకాపాకు వత్తాసు

ఈనాడు, కడప: వైకాపాతో అంటకాగుతున్నారని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కడప డీఎస్పీ షరీఫ్‌ మరోసారి ఆ పార్టీకి నిస్సిగ్గుగా వత్తాసు పలికారు. అధికారపార్టీ అరాచకాన్ని కప్పిపుచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. వైయస్‌ఆర్‌ జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరానికి చెందిన చేనేత కార్మికుడు సుబ్బారావు, ఆయన భార్య పద్మావతి, కుమార్తె వినయ వైకాపా నాయకుల భూదాహం వల్ల బలవన్మరణానికి పాల్పడగా.. డీఎస్పీ షరీఫ్‌ ఆ విషయాన్ని పూర్తిగా పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారు. తన తండ్రి పేరిట ఉన్న భూమిని.. రెవెన్యూ రికార్డుల్లో ఇతరుల పేరిట మార్చేసి దాన్ని తాము అమ్ముకోవడానికి వీల్లేకుండా చేశారని, తహసీల్దారు లంచం తీసుకుని తమను నాశనం చేశారంటూ... సుబ్బారావు సూసైడ్‌ నోట్‌లో స్పష్టంగా పేర్కొన్నా.. డీఎస్పీ దానికీ వక్రభాష్యం చెప్పారు. చివరికి ప్రాణాలు తీసుకున్న బాధితులదే తప్పు అన్నట్లు నెపాన్ని వారిపై నెట్టేసి, వైకాపా నాయకులకు కొమ్ముకాశారు. సుబ్బారావు కుటుంబం అప్పులతోనే ఆత్మహత్య చేసుకుందని, దీనికి వ్యక్తిగత అంశాలే కారణమని తేల్చేశారు. భూమి సంబంధిత సమస్యలేమీ వారికి లేవని చెప్పుకొచ్చారు. సుబ్బారావు క్రికెట్‌ బెట్టింగ్‌లు ఆడేవారని, ఆయనకు చెడు అలవాట్లు ఉన్నాయని వ్యాఖ్యానించారు. కుటుంబ పోషణ భారమై అప్పుల బెంగతోనే సుబ్బారావు ఆత్మహత్య చేసుకున్నారంటూ కొత్త కథ అల్లారు. ‘సూసైడ్‌ నోట్‌’ను న్యాయస్థానాలు సైతం మరణ వాంగ్మూలంగా, కీలక సాక్ష్యంగా పరిగణిస్తాయి. అందులోని అంశాలకే వక్రభాష్యం చెప్పటం డీఎస్పీ షరీఫ్‌కే చెల్లింది. సుబ్బారావు కుటుంబం ఆత్మహత్య ఘటనపై ఆయన ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. కంగారు పడుతూ.. తడబడుతూ మాట్లాడారు.

డీఎస్పీ షరీఫ్‌ చెప్పింది: సుబ్బారావు కుటుంబం వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకుంది. వేరే కారణాల్లేవు.

ఈ ప్రశ్నకు బదులేది: సుబ్బారావు కుటుంబానికి తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన భూమిని ఆయనకు తెలియకుండానే రెవెన్యూ రికార్డుల్లో వైకాపా నాయకుడైన కట్టాక నారాయణయ్య అనుచరురాలు శ్రావణి పేరిట మార్చేశారు. అధికార పార్టీ నాయకులతో రెవెన్యూ అధికారులు కుమ్మక్కై ఈ అక్రమానికి పాల్పడ్డారు. ఆ భూమి అమ్ముకునేందుకు అవకాశం లేకపోవటంతో వేరే దారి కనిపించక సుబ్బారావు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. వారి సూసైడ్‌నోట్‌ చదివితే ఎవరికైనా ఇది అర్థమవుతుంది. అలాంటప్పుడు వ్యక్తిగత కారణాలతోనే వారు ప్రాణాలు తీసుకున్నారని డీఎస్పీ ఎలా తేల్చేస్తారు? అధికారపార్టీ నాయకుడిని, రెవెన్యూ అధికారులను ఎందుకు విచారించరు?

డీఎస్పీ: రెవెన్యూ రికార్డుల్లో మార్పులు.. కట్టా శ్రావణి పేరిట భూ బదలాయింపు 2017లోనే జరిగింది.

ఈ ప్రశ్నకు బదులేది: పాత తేదీలతో రెవెన్యూ రికార్డులు తారుమారు చేసిన ఘటనలు జిల్లాలో అనేకం వెలుగుచూశాయి. అలాంటప్పుడు 2017లోనే కట్టా శ్రావణి పేరిట భూ బదలాయింపు జరిగిందని డీఎస్పీ ఎలా తేల్చేస్తారు? దానికున్న శాస్త్రీయ ఆధారాలేంటి? సుబ్బారావు తండ్రి పేరిట ఉన్న భూమి 2017లోనే శ్రావణి పేరిట మారిపోతే.. 2020 వరకూ పీఎం కిసాన్‌ కింద సుబ్బారావు తండ్రికి ఆర్థికసాయం ఎలా అందుతుంది?

డీఎస్పీ: సుబ్బారావు తన తండ్రి పేరిట ఉన్నదిగా చెబుతున్నది ఆయన భూమి కాదు. అది ప్రభుత్వ భూమి. అది కట్టా శ్రావణి పేరిట అప్పట్లో మారిపోయింది.

ఈ ప్రశ్నకు బదులేది: ప్రభుత్వమే దశాబ్దాల కిందట సుబ్బారావు తండ్రి వెంకటాచలపతికి ఆ భూమిలో డీకేటీ పట్టా ఇచ్చింది. ఆ తర్వాత దానిపై పట్టాదారు పాస్‌పుస్తకం జారీ అయ్యింది. పీఎం కిసాన్‌ పథకం కింద సుబ్బారావు తండ్రికి ఆర్థికసాయం అందింది. ఆయన హక్కుదారుడు కాకపోతే సాయం ఎలా అందుతుంది? పట్టా ఉన్న భూమిని ప్రభుత్వభూమిగా ఎలా తేల్చేస్తారు?

డీఎస్పీ: సుబ్బారావు అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన క్రికెట్‌ బెట్టింగ్‌లు ఆడేవారు. చెడు అలవాట్లు ఉన్నాయి.

ఈ ప్రశ్నకు బదులేది: తన భూమిని ఇతరులు  కాజేశారని సుబ్బారావు సూసైడ్‌ నోట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. అది అమ్ముకోవడానికి వీల్లేకపోవడం  వల్లే ఆయన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నారు. అయినా ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా, ఆయనదే తప్పు అన్నట్లుగా చిత్రీకరించటం వెనుక మీ దురుద్దేశం బయటపడట్లేదా?


ఎలాంటి హక్కు పత్రాలు లేవు

-డీఎస్పీ షరీఫ్‌

సుబ్బారావు భార్య పద్మావతి, కుమార్తె వినయ విష రసాయనం సేవించినట్లు వైద్యుల ప్రాథమిక నివేదికలో వెల్లడైందని డీఎస్పీ షరీఫ్‌ తెలిపారు. వారి ‘సూసైడ్‌ నోట్‌’ పరిశీలించామని, భూమి వివరాలు వెబ్‌ల్యాండ్‌లో నమోదుచేయడం మినహా వారివద్ద ఇతర ఎలాంటి హక్కు పత్రాల్లేవని పేర్కొన్నారు. ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘‘సుబ్బారావు తండ్రి వెంకటాచలపతికి అధికారికంగా ప్రభుత్వం భూమి కేటాయించలేదు. ఇప్పటికీ అది ప్రభుత్వభూమే. సుబ్బారావుకు రూ.40-50 లక్షల అప్పు ఉంది. చేనేత పనులు చేయకుండా తాగుడుకు, క్రికెట్‌ బెట్టింగ్‌లకు బానిసై అప్పులు చేశారు. 2187-2లో ఉన్న భూమికి సుబ్బారావు, అతని తండ్రి వెంకటాచలపతి పేరుతో డీకేటీ పట్టాలు మంజూరుచేసినట్లు రికార్డులు లేవు. ఈ భూమి సాగులో లేదు. రాళ్లు, చెట్లతో ఉంది. ఎవరి అనుభవంలోనూ లేదు. కట్టా శ్రావణి తండ్రి సుబ్బరాయుడు సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌. ఉద్యోగం నిమిత్తం 20 ఏళ్ల కిందట గ్రామం వదిలి వెళ్లారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌ రాష్ట్రం గ్వాలియర్‌లో ఉన్నారు. శ్రావణి ఉద్యోగరీత్యా అమెరికాలో ఉన్నారు. ఈ సర్వే నంబరుకు, తమకు సంబంధం లేదని వారు చెప్పారు. సుబ్బారావు కుటుంబం ఆత్మహత్యకు భూ సమస్య కారణం కాదు. అప్పులే ప్రధాన కారణం. మృతదేహాలకు ఫోరెన్సిక్‌ నిపుణులతో శవపరీక్ష చేయించాం. భూముల్లో పేర్ల మార్పుపై కడప ఆర్డీవో ఆధ్వర్యంలో విచారణ జరుగుతుంది. అప్పట్లో ఏ అధికారి ఉన్నారు, ఇందుకు సహకారం అందించిన ఉద్యోగులు, మధ్యవర్తుల పాత్రపై సమగ్ర సమాచారం సేకరిస్తాం.. ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్‌ జమకాలేదు’’ అని డీఎస్పీ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని