SIM: తప్పుడు ధ్రువీకరణలతో 21లక్షల సిమ్‌కార్డులు.. రద్దుకు డీవోటీ చర్యలు..!

దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో తప్పుడు సిమ్‌కార్డులను ఏరివేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ డిజిటల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం రంగంలోకి దిగింది. 21 లక్షల సిమ్‌కార్డులు అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించింది. 

Published : 20 Mar 2024 10:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశ వ్యాప్తంగా తప్పుడు ప్రూఫ్‌ల ఆధారంగా సుమారు 21 లక్షల సిమ్‌కార్డులు జారీ అయినట్లు తమ విశ్లేషణలో తేలిందని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌ తెలిపింది. ఈ మేరకు ఎయిర్‌టెల్‌, ఎంటీఎన్‌ఎల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌, జియో, వొడాఫోన్‌ సంస్థలకు అలర్ట్‌ జారీ చేసినట్లు వెల్లడించింది. కొన్ని అనుమానాస్పద నంబర్ల జాబితాను విడుదల చేసి చేసి వాటి పత్రాలను తక్షణమే రీవెరిఫికేషన్‌ చేయాలని ఆదేశించినట్లు చెబుతోంది. ఒక వేళ అవి బోగస్‌ ప్రూఫ్‌లని తేలితే సిమ్‌లను రద్దు చేయాలని పేర్కొంది. 

సంచార్‌ సాతీ కార్యక్రమం కింద దేశ వ్యాప్తంగా 114 కోట్ల మొబైల్‌ కనెక్షన్లను డీవోటీకి చెందిన ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ డిజిటల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం విశ్లేషించింది. వీటిల్లో 21 లక్షల సిమ్‌కార్డులను యాక్టివేట్‌ చేసుకోవడానికి తప్పుడు ధ్రువీకరణ పత్రాలను సమర్పించినట్లు గుర్తించింది. వీటిలో చాలా సిమ్‌లను సైబర్‌ నేరాలకు వాడుతున్నట్లు అనుమానిస్తోంది. ఇవి నిరూపితమైతే ఆ సిమ్‌ కార్డును రద్దు చేయడంతోపాటు.. దానిని వినియోగించిన ఫోన్‌ను కూడా పనిచేయకుండా చేస్తామని ఏఐ అండ్‌ డీఐయూ డైరెక్టర్‌ జనరల్‌ ముఖేశ్‌ మంగళ్‌ వెల్లడించారు. 

దేశ వ్యాప్తంగా 1.92 కోట్ల మంది తొమ్మిది సిమ్‌కార్డుల పరిమితికి మించి కనెక్షన్లు తీసుకొన్నారు. వీరిలో చాలా మంది సర్వీసు ప్రొవైడర్లకు ఇచ్చిన డేటాలో చాలా తప్పులున్నాయి. ప్రజలకు తెలియకుండా వారిపేరిట తీసుకొనే సిమ్‌కార్డులను గుర్తించి వాటిని రద్దు చేయించడానికి సంచార్‌ సాతీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 

ఈ నెంబర్లపై దర్యాప్తు సహా ఇతర చర్యలకు డీవోటీ ఇప్పటికే సర్వీసు ప్రొవైడర్లకు డెడ్‌లైన్‌ విధించింది. వీటిని పూర్తి చేసే క్రమంలో భారీ సంఖ్యలో సిమ్‌కార్డులు డిస్‌కనెక్ట్‌ అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఈ మొత్తం ఆపరేషన్‌లో ఏఐ అండ్‌ డీఐయూ సంస్థ ఇతర చట్ట సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ఇప్పటి వరకు 1.8లక్షల మొబైల్‌ హ్యాండ్‌సెట్లను పనిచేయకుండా చేశామని అధికారులు చెబుతున్నారు. మరోవైపు తమిళనాడు డీజీపీ శంకర్‌ జివాల్‌ మాట్లాడుతూ 90శాతం సైబర్‌ నేరాలకు తప్పుడు సిమ్‌కార్డులనే వాడుతున్నట్లు పేర్కొన్నారు. పోలీసులు తమను ట్రాక్‌ చేయడానికి వీల్లేకుండా వారు వీటిని వినియోగిసున్నారన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని