Inflation: తొందరపడి ఉంటే మూల్యం చెల్లించుకునేవాళ్లం: ఆర్‌బీఐ గవర్నర్‌

ధరల్ని నియంత్రించే విషయంలో ఆర్‌బీఐ తీసుకున్న చర్యల్ని గవర్నర్‌ శక్తికాంత దాస్‌ సమర్థించారు. ఏమాత్రం తొందరపడినా పరిణామాలు తీవ్రంగా ఉండి ఉండేవని తెలిపారు.

Published : 02 Nov 2022 16:07 IST

ముంబయి: ధరల్ని అదుపు చేయడానికి తీసుకునే చర్యల విషయంలో తొందరపడి ఉంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చి ఉండేదని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్నారు. తాము సమయానుసారంగా స్పందించామంటూ ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్‌బీఐ తీసుకున్న చర్యల్ని సమర్థించారు. ధరలు పెరుగుతున్నప్పటికీ.. వడ్డీరేట్లను పెంచకపోవడం ద్వారా కీలక సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచామని తెలిపారు. ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా అడ్డుకున్నామన్నారు. ద్రవ్య విధానాన్ని కఠినతరం చేయకుండా రేట్లను తక్కువగా ఉంచడం వల్లే ఇది సాధ్యమైందన్నారు.

ద్రవ్యోల్బణ కట్టడి విషయంలో ఆర్‌బీఐ లక్ష్యాన్ని చేరుకోలేకపోయిందని శక్తికాంత దాస్‌ తెలిపారు. దీనిపై వివరణ ఇస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన కమిటీ గురువారం భేటీ కానుందని తెలిపారు. అయితే, నివేదికను బహిర్గతం చేయబోమని తెలిపారు. దీంట్లో ఎలాంటి దాపరికాలు లేవని.. అయితే, ప్రభుత్వం, కేంద్ర బ్యాంకు మధ్య జరిగే సమాచార బదిలీని బహిర్గతం చేసేందుకు నిబంధనలు అంగీకరించబోవన్నారు. వరుసగా మూడు త్రైమాసికాల పాటు రిటైల్‌ ద్రవ్యోల్బణం 6 శాతానికి ఎగువన ఉండడానికి గల కారణాలపైనే నివేదికలో దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. ఎప్పటికల్లా ఇది ఆర్‌బీఐ లక్షిత పరిధిలోకి వచ్చే అవకాశం  కూడా వివరిస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని