Sunil Mittal: సునీల్‌ మిత్తల్‌కు బ్రిటన్‌ నైట్‌హుడ్‌ పురస్కారం

ప్రముఖ పారిశ్రామికవేత్త సునీల్ భారతీ మిత్తల్‌(Sunil Mittal)కు నైట్‌హుడ్ పురస్కారం దక్కింది. 

Updated : 29 Feb 2024 16:48 IST

దిల్లీ: భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ వ్యవస్థాపకుడు సునీల్ భారతీ మిత్తల్‌ (Sunil Bharti Mittal)కు అరుదైన గౌరవం లభించింది. బ్రిటన్‌ ప్రభుత్వం ఆయన్ను ప్రతిష్ఠాత్మక పురస్కారమైన నైట్‌హుడ్‌ ఇచ్చి సత్కరించింది. కింగ్ ఛార్లెస్‌ 3 చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోనున్న తొలి భారతీయుడు మిత్తల్ కావడం విశేషం. బ్రిటన్ ప్రభుత్వం పౌరులకు అందించే అత్యున్నత పురస్కారాల్లో నైట్‌ కమాండర్ ఆఫ్‌ మోస్ట్ ఎక్స్‌లెంట్ ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ అంపైర్ అవార్డు (KBE) ఒకటి. పలు రంగాల్లో విశిష్ఠ సేవలందించిన విదేశీ పౌరులను ఈ పురస్కారంతో గౌరవిస్తుంటారు. 

‘‘బ్రిటన్ రాజు ఛార్లెస్‌ 3 నుంచి దక్కిన ఈ గుర్తింపును గౌరవంగా భావిస్తున్నాను. యూకే, భారత్‌ మధ్య చరిత్రాత్మక సంబంధాలు ఉన్నాయి. ఇవి ప్రస్తుతం మరింత బలపడుతున్నాయి. రెండు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నాను. దేశాన్ని ఆకర్షణీయమైన పెట్టుబడి స్థానంగా మార్చడంలో శ్రద్ధ వహించిన యూకే ప్రభుత్వానికి కృతజ్ఞతలు’ అని మిత్తల్‌ సంతోషం వ్యక్తం చేశారు. 2007లో సునీల్ మిత్తల్‌కు భారత ప్రభుత్వం పద్మభూషణ్‌ ఇచ్చింది. గతంలో రతన్‌టాటా (2009), రవిశంకర్‌ (2001), జమ్‌షెడ్ ఇరానీ (1997) ఈ నైట్‌హుడ్ పురస్కారం పొందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని