CHIMTU: ఇంటర్నెట్‌ సెన్సేషనల్‌ మీమ్‌ డాగ్‌ ‘చిమ్‌టూ’ ఇకలేదు

మీమ్‌ వరల్డ్‌లో అత్యంత ఆదరణ కలిగిన శునకం చిమ్‌టూ కన్నుమూసింది.

Published : 24 May 2024 14:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మీమ్‌ ప్రపంచంలో సంచలనం సృష్టించిన జపనీస్‌ శునకం కబోసు కన్నుమూసింది. సోషల్‌మీడియాలో ‘వైరల్‌ డాగీ’గా పేరు పొందడమే కాదు, క్రిప్టో కరెన్సీ డాగీకాయిన్‌ లోగోనూ దీని ఫొటో ఉండేది. గత కొన్ని రోజులుగా లుకేమియాతో బాధపడుతున్న కబోసు మరణించినట్లు డాగీ కాయిన్‌ క్రిప్టోకరెన్సీ తన ఎక్స్‌ ఖాతా ద్వారా ప్రకటించింది.

‘మా కమ్యూనిటీ భాగస్వామి, స్నేహితురాలు కబోసు ప్రశాంతంగా కన్నుమూసింది. అపరిమితమైన సంతోషం, ప్రేమకు కబోసు చిరునామా. మీమ్‌ వరల్డ్‌లో తనదైన ముద్రవేసింది. అది ఎప్పుడూ మీ గుండెల్లో నిలిచిపోతుంది’ అని డాగీకాయిన్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. మీమ్‌ వరల్డ్‌లో భారతీయ నెటిజన్లకు ‘చిమ్‌టూ’గా ఈ శునకం సుపరిచితం. ఈ శునకం థీమ్‌తో రూపొందించిన మీమ్స్‌ విపరీతంగా వైరల్‌ అయ్యాయి. ముఖ్యంగా క్రికెట్‌, సినిమా, రాజకీయాలు, యూత్‌ అంశాలు, భార్యాభర్తలు, ప్రేమికుల జోక్స్‌ను చిమ్‌టూ ఫొటోలతో మీమర్స్‌ రూపొందించేవారు. పలు సామాజిక యాప్‌లు సైతం ప్రత్యేకంగా చిమ్‌టూ స్టిక్కర్లను తీసుకొచ్చాయి.

2010 నుంచి కబోసు చిత్రాలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతూ ఉండేవి. 2013లో క్రిప్టోకరెన్సీ డాగీకాయిన్‌ మొదలు పెట్టినప్పుడు కబోసును ప్రొఫైల్‌ పిక్‌గా తీసుకోవడంతో మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. మొదట్లో దీన్నో జోక్‌గా తీసుకున్నారు. అనతికాలంలోనే డాగీకాయిన్‌ క్రిప్టోకరెన్సీ ఇతర డాగ్‌ థీమ్‌ క్రిప్టోలను దాటడం గమనార్హం. గతేడాది ఏప్రిల్‌లో ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ కూడా ట్విటర్‌ లోగోగా కబోసు ఫొటోను కొన్ని రోజుల పాటు ఉంచారు. దీంతో డాగీ కాయిన్‌ క్రిప్టో విలువ మరింత పెరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని