Byju Raveendran: బైజూస్‌ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌పై ఈడీ లుకౌట్‌ నోటీసులు

Byju Raveendran: దేశం విడిచి వెళ్లొద్దని బైజూస్‌ రవీంద్రన్‌ను ఈడీ ఆదేశించింది. ఈ మేరకు లుకౌట్‌ నోటీసులు జారీ చేసింది.

Updated : 22 Feb 2024 13:14 IST

దిల్లీ: ప్రముఖ ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు (Byju Raveendran) కష్టాలు మరింత తీవ్రమయ్యాయి. ఆయనకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) లుకౌట్‌ నోటీసులు జారీ చేసింది. దేశం విడిచి వెళ్లకుండా చూడాలని సంబంధిత వర్గాలను ఆదేశించింది. గత ఏడాది బెంగళూరులో రెండు కార్యాలయాలతో పాటు ఆయన నివాసంలో సోదాలు జరిపింది.

ఇప్పటికే రవీంద్రన్‌పై ‘ఆన్‌ ఇంటిమేషన్‌ లుకౌట్‌ సర్క్యులర్‌’ అమల్లో ఉంది. అంటే విదేశాలకు వెళ్లినప్పుడు ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ఈడీకి ముందుగానే సమాచారం అందజేయాల్సి ఉంటుంది. తాజాగా పూర్తిస్థాయి లుకౌట్‌ సర్క్యులర్‌ జారీ అవడంతో ఇకపై దేశం విడిచి వెళ్లడానికి ఆస్కారం ఉండదు. బైజూస్‌ బ్రాండ్‌పై కార్యకలాపాలు నిర్వహిస్తున్న థింక్‌ అండ్‌ లెర్న్‌ తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ సంస్థ విలువ ఏడాది వ్యవధిలో రూ.1,82,600 కోట్ల నుంచి రూ.16,600 కోట్లకు పడిపోయినట్లు పలు ప్రముఖ ఆర్థిక సంస్థలు అంచనా చేశాయి. కొన్ని నెలలుగా నగదు లభ్యత సమస్యల్లో ఉన్న ఈ కంపెనీ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు కూడా చెల్లించలేని స్థితిలో ఉంది.

మరోవైపు రవీంద్రన్‌ను సీఈఓ పదవి నుంచి తొలగించేందుకు కొంత మంది వాటాదారులు అసాధారణ బోర్డు సమావేశానికి (EGM) పిలుపునిచ్చారు. కొత్త బోర్డును ఎన్నుకోవాలని నిర్ణయించారు. అందుకోసం ఫిబ్రవరి 23న సమావేశం ఏర్పాటు చేయాలని కంపెనీని కోరారు. వాటాదారుల నిర్ణయాన్ని సవాలు చేస్తూ బైజూస్‌ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం.. ఈజీఎం నిర్వహణకు అనుమతించింది. కానీ, అందులో తీసుకునే నిర్ణయాలను మాత్రం తదుపరి విచారణ వరకు అమలు చేయొద్దని ఆదేశించింది. బైజూస్‌లో ఇన్వెస్టర్లుగా ఉన్న ప్రోసస్‌, పీక్‌ ఎక్స్‌వీ, సోఫినా, లైట్‌స్పీడ్‌, జనరల్‌ అట్లాంటిక్‌ సంస్థలు ఈజీఎంకు పిలుపునిచ్చినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని