Elon Musk : ట్విటర్‌లో మరో మార్పు.. త్వరలో ‘డార్క్‌ మోడ్‌’ మాత్రమే ఉంటుందన్న మస్క్‌!

ట్విటర్‌లో (Twitter) రోజుకో మార్పు వస్తోంది. త్వరలో ఈ సామాజిక మాధ్యమాన్ని యూజర్లు కేవలం డార్క్‌ మోడ్‌లో (Dark mode) మాత్రమే చూడగలరు.

Published : 28 Jul 2023 15:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్ : ట్విటర్‌ (ప్రస్తుతం ఎక్స్‌) అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) మరో మార్పునకు శ్రీకారం చుట్టబోతున్నారు. త్వరలో ‘ఎక్స్‌’ ప్లాట్ ఫామ్‌ (X platform) మొత్తాన్ని డార్క్‌మోడ్‌లో (Dark mode) చూడబోతున్నారని ఆయన ట్వీటర్‌లో తెలిపారు. ప్రస్తుతం సెట్టింగ్స్‌లోని డిస్‌ప్లే ఆప్షన్స్‌లో లైట్‌, డార్క్‌, డిమ్‌ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. మస్క్‌ నిర్ణయం అమలైతే డార్క్‌ మాత్రమే మిగులుతుంది.

అమెజాన్‌ నుంచి ఫ్రీడమ్‌ సేల్‌.. తేదీలు, ఆఫర్లు ఇవే!

అపర కుబేరుడైన ఎలాన్‌ మస్క్‌ కొద్ది నెలల క్రితం ట్విటర్‌ను కొనుగోలు చేశారు. అప్పటి నుంచి అందులో మార్పులు, చేర్పులు చేస్తున్నారు. సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఉండే బ్లూ టిక్‌ను అకస్మాత్తుగా తొలగించారు. నెలకు ఇంత మొత్తం చెల్లిస్తే సామాన్యులకు సైతం ఆ ‘టిక్‌’ ఇస్తామని ప్రకటన చేశారు. ఆ తరువాత ట్వీట్‌లు చూడటానికి, చేయడానికి సైతం పరిమితి పెట్టారు. యూజర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కొంచెం వెనక్కి తగ్గారు. ట్విటర్‌లో ఇన్ని మార్పులు చేపట్టిన ఎలాన్‌ మస్క్‌ ఈ వారంలోనే దాని పేరును ‘ఎక్స్‌’గా మార్చారు. ట్విటర్‌ లోగోలో ఉన్న పిట్టను తొలగించి ‘ఎక్స్‌’ చేర్చారు. ఆ సందర్భంలో ట్విటర్‌ను త్వరలో ఓ సూపర్‌ యాప్‌గా అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. తాజాగా ‘ఈ ప్లాట్‌ ఫామ్ మొత్తం డార్క్‌ మోడ్‌లోకి మారబోతోంది. ఇది అన్ని విధాలుగా మంచిది’ అంటూ ట్విటర్‌లో వెల్లడించారు.

ఈ మార్పుపై ట్విటర్‌ యూజర్లు స్పందిస్తున్నారు. ‘నాకు కూడా నలుపు రంగు ఇష్టం. కానీ, డార్క్‌మోడ్‌ను వినియోగించడం అంతగా బాగోదని’ ఓ నెటిజన్‌ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ‘ఎక్కువ మంది ఇష్టపడే ఎంపికను దూరం చేయడం మంచిది కాదు. ఇది ఉద్దేశపూర్వకంగా ప్రజలను ట్విటర్‌ నుంచి వెళ్లిపోయేలా చేస్తున్నట్లుందని’ ఓ నెటిజన్‌ అభిప్రాయపడ్డాడు. ‘ఇది భయంకరమైన నిర్ణయం. సూర్యరశ్మి, పరిసరాలు ప్రకాశవంతంగా ఉన్నప్పుడు డార్క్‌మోడ్‌లో చదవడం చాలా కష్టం. అనవసరంగా కళ్లపై ఒత్తిడి పడుతుంది. టెక్స్ట్‌ ఆధారిత ప్లాట్‌ఫామ్‌లో కేవలం డార్క్‌మోడ్‌ పెడితే భయంకరంగా ఉంటుంది. ఈ అర్థం లేని మార్పుపై పునరాలోచన చేయండి. ట్విటర్‌. క్షమించండి ఎక్స్‌’ అంటూ ఓ యూజర్‌ తన ఆవేదన వెలిబుచ్చాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని