Elon Musk: ట్విటర్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ఈసారి ఎవరివంతంటే..!

ట్విటర్‌ (Twitter) ఉద్యోగాల్లో నవంబరు 2022  నుంచి కోతలు విధించబోనని చెప్పిన ఎలాన్‌ మస్క్‌ (Elon Musk).. ఆ తర్వాత రెండు సార్లు ఉద్యోగులపై వేటు వేశారు. తాజాగా  మరోసారి ఉద్యోగాల్లో కోత విధించినట్లు తెలుస్తోంది. 

Updated : 23 Feb 2023 19:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ట్విటర్‌ (Twitter)ను ఎలాన్‌మస్క్‌ (Elon Musk) కొనుగోలు చేసిన నాటి నుంచి భారీగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అటు ఉన్నతస్థాయిలో ఉద్యోగులతోపాటు, దిగువస్థాయి సిబ్బందిలోనూ సమూలంగా మార్పులుచేర్పులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ సంస్థ సీఈవో పరాగ్‌ అగర్వాల్‌ (Parag Agarwal)ను ఇంటికి పంపించేసి.. సీఈవో బాధ్యతలను తాను తీసుకున్నారు. ఆయన ఒక్కరే కాదు చాలా మంది కీలక సభ్యులపైనా వేటు వేశారు. మరోవైపు కొందరు ఉద్యోగులను తొలగించడం (Lay off)తోపాటు మరికొందరి జీతాల్లో కోత విధించారు. నవంబరు 2022 తర్వాత ట్విటర్‌ ఉద్యోగాల్లో కోత విధించబోమంటూ చెప్పిన ఎలాన్‌ మస్క్.. ఆ అప్పటి నుంచి రెండు విడతలుగా ఉద్యోగులను తొలగించారు. తాజాగా వారం రోజుల క్రితం మరోసారి ఉద్యోగులపై వేటు పడినట్లు తెలుస్తోంది. ఈ సారి సేల్స్‌, ఇంజినీరింగ్‌ విభాగంలోని ఉద్యోగులు బాధితులుగా మారినట్లు సమాచారం.

అమెరికాకు చెందిన వర్జే న్యూస్‌వెబ్‌సైట్‌ వెల్లడించిన వివరాల ప్రకారం... గత వారం సేల్స్‌, ఇంజినీరింగ్‌ విభాగంలో పని చేస్తున్న ఉద్యోగులను తొలగించారు. దీనిపై కొందరు ఉద్యోగులు నేరుగా ఎలాన్‌ మస్క్‌కే ఫిర్యాదు చేశారు. సంస్థ ఆదేశాల మేరకు ట్విటర్‌ యాడ్స్ కోసం పని చేస్తున్నా తమను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నారని ఆయనతో మొరపెట్టుకున్నట్లు తెలుస్తోంది.  ఈ నేపథ్యంలో ట్విటర్‌ యాడ్స్‌పై ఉద్యోగులు పూర్తి స్థాయిలో అధ్యయం చేసిన వారం రోజుల్లోగా సరైన పరిష్కారాన్ని కనుగొనాల్సిందిగా ఉద్యోగులపై ఎలాన్‌మస్క్‌ హుకుం జారీ చేసినట్లు వెబ్‌సైట్‌ పేర్కొంది. అయితే, తాజాగా ఉద్యోగుల్లో కోత విధించడానికి గల కారణాలేంటో మాత్రం స్పష్టంగా తెలియడం లేదు.

తాజా పరిస్థితులపై గతంలో ట్విటర్‌లో మానిటైజేషన్‌ మేనేజర్‌గా విధులు నిర్వహించిన మార్సిన్‌ కల్దుల్క్సా ట్విటర్‌ వేదికగా స్పందించారు. ట్విటర్‌ యాడ్స్‌కు ఓ పరిష్కారం కనుకొనాలంటే కనీసం రెండుమూడు నెలలు పడుతుందని, ఒక వారంలో చేయడం సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. మరోవైపు  ట్విటర్‌ యాడ్స్‌, మానిటైజేషన్‌ ఇన్‌ఫ్రాలో పని చేస్తున్న వారంతా ఎంతో అనుభవశీలురని పేర్కొంటూ, పరిస్థితులను చక్కదిద్దడంలో వారికున్న నైపుణ్యం, అనుభవం, దూరదృష్టి ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఉపయోగపడతాయన్నారు.

ఎలాన్‌మస్క్‌ క్షమాపణ

ట్విటర్‌లో అనసవరమైన, అభ్యంతరకరమైన ప్రకటనలు వస్తుండటంపై ఎలాన్‌ మస్క్‌ ఇటీవల యూజర్లకు క్షమాపణలు చెప్పారు. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు సత్వర చర్యలు తీసుకుంటానని అన్నారు. గూగుల్‌ సెర్చ్‌ మాదిరిగా ట్విటర్‌లోనూ యూజర్‌ టాపిక్స్‌, కీవర్డ్స్‌ ఆధారంగా ప్రకటనలు కనిపించేలా మార్పులు తీసుకొస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే ఉద్యోగులపై మరింత భారం పెడుతున్నట్లు తెలుస్తోంది. యాడ్స్‌ విషయంలోనే సంస్థ ప్రకటనల విభాగం మాజీ అధిపతి బ్రూస్‌ ప్లాక్‌, ఎలాన్‌ మస్క్‌ మధ్య ట్విటర్‌ వేదికగా ఇటీవల మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ‘మస్క్‌ ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు’ అంటూ బ్రూస్‌ఫ్లాక్‌  ట్వీట్‌ చేయగా.. ‘ మీరు చాలా మేధావి. అందుకే ట్విటర్‌ యాడ్స్‌ అత్యంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొంది. ట్విటర్‌లో ప్రకటనలు చూసి దాదాపు ఎవరూ ఏమీ కొనడం లేదు’’ అంటే ఘాటుగా సమాధానమిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని