Budget 2023: డిజిలాకర్‌ విస్తరణ..ఇక చిటికెలో కేవైసీ సేవలు..!

డిజిలాకర్‌ (digilocker services) సేవలను ఫిన్‌టెక్‌ సర్వీసులు, చిన్న, మధ్యతరహా పరిశ్రమ వర్గాలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

Published : 01 Feb 2023 17:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రభుత్వం అందించే వివిధ రకాల సేవలకు ప్రజలను చేరువ చేసేందుకు కేంద్రం ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా పలు రకాల సేవలను డిజిటల్‌ రూపంలో అందించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో పౌరులకు విస్తృతంగా సేవలను అందిస్తున్న డిజిలాకర్‌ (digilocker services)ను ఫిన్‌టెక్‌ సర్వీసులు, చిన్న, మధ్యతరహా పరిశ్రమ వర్గాలకు కూడా అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయనున్నారు.  ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌లో కీలక ప్రకటన చేశారు.

‘‘ఫిన్‌టెక్‌ సర్వీసుల కోసం కేవైసీ (KYC) (నో యువర్‌ కస్టమర్‌) సేవలు మరింత సరళతరం చేయనున్నాం. ఇందులో భాగంగా ఆర్థిక సేవలు అందించే సంస్థలకు ఆధార్‌, పీఎం జన్‌ధన్‌ యోజన, వీడియో కేవైసీ, ఇండియా స్టేక్‌, యూపీఐ వివరాలను డిజిలాకర్‌లో అందుబాటులో ఉంచుతాం. దీని ద్వారా ఆర్థిక సేవలు మరింత త్వరగా పౌరులకు అందుతాయి’’ అని నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. అయితే, కేవైసీ వివరాలు బయటకు పొక్కకుండా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన బాధ్యత సదరు సంస్థలకు ఉంటుంది. వాటి భద్రతకు ఆయా సంస్థలే బాధ్యత వహించాలి. డిజిలాకర్‌ వినియోగంతో ఆర్థిక సేవలకు సంబంధించిన వ్యవహారాలు మరింత సులభంగా జరిగిపోతాయి. అటు ఆర్థిక సంస్థల, ఇటు వినియోగదారుల సమయం ఆదా అవుతుంది.

‘‘చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, పెద్ద వ్యాపారాలు, స్వచ్ఛంద సంస్థల అవసరాలకు అనుగుణంగా డిజిలాకర్‌ సేవలు అందుబాటులోకి తెస్తాం. దీని వల్ల అధికార వర్గాలు, నియంత్రణా సంస్థలు, బ్యాంకులు, వ్యాపార నిర్వాహకులు తమకు అవసరమైన సేవలను దాని ద్వారా పొందవచ్చు’’

ప్రభుత్వ గణాంకాల ప్రకారం 14.6కోట్ల మందికి పైగా ప్రజలు డిజిలాకర్‌ సేవలు పొందుతున్నారు. ముఖ్యంగా ఆధార్‌, పాలసీ డాక్యుమెంట్లు, పాన్‌ కార్డ్‌, ధ్రువీకరణ పత్రాలు, బీమా పాలసీలు ఇలా అనేక ముఖ్య పత్రాలు డిజిలాకర్‌లో అందుబాటులో ఉంటున్నాయి. తాజా నిర్ణయం ద్వారా డిజిటల్‌ ఇండియా దిశగా ప్రభుత్వం అడుగులు వేసినట్లైంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ఎక్స్‌లెన్స్ కేంద్రాలు

‘మేక్ ఏఐ ఇన్ ఇండియా, మేక్ ఏఐ వర్క్ ఫర్ ఇండియా’ విజన్‌ను సాకారం చేయడం కోసం, అగ్రశ్రేణి విద్యా సంస్థల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం మూడు ఎక్స్‌లెన్స్ సెంటర్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.

5జీ అప్లికేషన్ల తయారీకి ఇంజినీరింగ్‌ సంస్థల్లో 100 ప్రయోగశాలలు ఏర్పాటు చేయటంతో పాటు, స్టార్టప్‌లకు ప్రత్యేక ప్రోత్సాహం అందించడం ద్వారా రిస్క్‌ తగ్గించేందుకు కృషి చేయనున్నట్లు ఆర్థిక మంత్రి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని