EPFO Wage ceiling: ₹21 వేలకు ఈపీఎఫ్‌ఓ వేతన పరిమితి.. కేంద్రం యోచన!

ఈపీఎఫ్‌ఓ వేతన పరిమితిని పెంచాలని కేంద్రం భావిస్తోంది. అదే జరిగితే ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది.

Updated : 11 Apr 2024 16:32 IST

దిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) కింద ఉన్న ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితిని పెంచాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం ఇది రూ.15వేలుగా ఉండగా.. ఆ మొత్తాన్ని రూ.21వేలకు చేర్చనుందనే ప్రచారం జరుగుతోంది. ఏళ్లుగా దీనిని పెంచాలని డిమాండ్లు ఉన్నాయి. తాజాగా మరోసారి దీనిపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఎనకమిక్‌ టైమ్స్‌ కథనంలో పేర్కొంది.

కొత్త ప్రభుత్వంలో దీనికి సంబంధించిన నిర్ణయం వెలువడొచ్చని ఓ సీనియర్‌ అధికారి పేర్కొన్నారు. వేతన పరిమితిని పెంచడం వల్ల ప్రభుత్వంతో పాటు ప్రైవేటు రంగంపైనా ఆ భారం పడుతుంది. దీనివల్ల ఉద్యోగులకు మాత్రం మేలు జరుగుతుంది. ఈపీఎఫ్‌ఓ  గరిష్ఠ వేతన పరిమితి చివరిసారిగా 2014లో సవరించారు. అప్పట్లో రూ.6,500గా ఉన్న మొత్తాన్ని రూ.15వేలకు పెంచారు. మరోవైపు ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ESIC) ఇప్పటికే వేతన పరిమితిని రూ.21 వేలకు చేర్చింది. ఈపీఎఫ్‌ కూడా ఆ మొత్తానికి చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఉద్యోగులకు ఎలా ప్రయోజనం?

వేతన పరిమితి పెంచితే దీనివల్ల ఉద్యోగుల భవిష్యనిధి ఖాతాకు జమ అయ్యే మొత్తం ఆ మేర పెరగనుంది. సాధారణంగా ఉద్యోగి వాటాగా వేతనంపై 12 శాతం, యజమాని వాటా 12 శాతం చెల్లిస్తారు. ఉద్యోగి వాటా పూర్తిగా ఈపీఎఫ్‌ ఖాతాలో జమవుతుంది. యజమాని వాటా నుంచి 8.33 శాతం పింఛను పథకంలో.. మిగతా మొత్తం ఈపీఎఫ్‌ ఖాతాలో జమవుతుంది. గరిష్ఠ వేతన పరిమితిని పెంచితే ఆ మేర ఉద్యోగి, యజమాని చెల్లించాల్సిన వాటా పెరుగుతుంది. దీనివల్ల ఈపీఎఫ్‌ఓ, ఈపీఎస్‌ ఖాతాలో జమయ్యే మొత్తం పెరుగుతుంది. దీంతో రిటైర్మెంట్‌ సమయానికి ఉద్యోగి తన భవిష్యనిధి నిల్వలను పెంచుకోవడానికి వీలుపడుతుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని