EV Manufacturing: ఈవీల వల్ల చైనాపై మరింత ఆధారపడాలి!: GTRI

Electric vehicles Manufacturing: విద్యుత్‌ వాహనాల తయారీని పెంచడం వల్ల చైనాపై ఆధారపడడం పెరుగుతుందని ఓ నివేదిక పేర్కొంది. విద్యుత్‌ వాహనాల్లో ఉన్న ఇతర అంశాలనూ చర్చించింది.

Published : 07 Mar 2023 14:01 IST

దిల్లీ: దేశంలో విద్యుత్‌ వాహనాల (Electric vehicles) వినియోగం క్రమక్రమంగా పెరుగుతోంది. కర్బన ఉద్గారాలు తగ్గించేందుకు ప్రభుత్వం సైతం రాయితీలు ఇస్తోంది. దీంతో విద్యుత్‌ వాహనాల కొనుగోలుకు వాహనదారులు ముందుకొస్తున్నారు. అయితే, దేశంలో విద్యుత్‌ వాహనాల తయారీని (EV Manufacturing) పెంచడం వల్ల చైనాపై భారత్‌ ఆధారపడడమూ పెరుగుతుందని ఆర్థిక మేధో సంస్థ గ్లోబల్ ట్రేడ్‌ రీసెర్చి ఇనిషియేటివ్‌ (GTRI) తెలిపింది. ముడి సరకులు, మినరల్‌ ప్రాసెసింగ్‌, బ్యాటరీ ఉత్పత్తి కోసం ఆ దేశంపై ఆధారపడాల్సిన అవసరం పెరుగుతుందని తన నివేదికలో పేర్కొంది. ఈవీల వల్ల ఉన్న మరికొన్ని లోటుపాట్లను సైతం తన నివేదికలో చర్చించింది. బ్యాటరీ తయారీ, వినియోగం, రీసైక్లింగ్‌ వల్ల కాలుష్యం పెరుగుతుందని చెప్పింది.

ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా నుంచి భారీగా లిథియం గనులను చైనా కొనుగోలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తయ్యే లిథియంలో 60 శాతం చైనానే ప్రాసెస్‌ చేస్తుంటుంది. ఒక్క లిథియమే కాదు 65 శాతం కోబాల్ట్‌, 93 శాతం మాంగనీస్‌ను చైనా ప్రాసెస్‌ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నాలుగు బ్యాటరీలు ఉత్పత్తి అయితే అందులో మూడు బ్యాటరీలు చైనానే తయారు చేస్తోంది. లిథియం ఐయాన్‌ సెల్స్‌లో వినియోగించే 60 శాతం కేథోడ్‌లను, 80 శాతం యానోడ్స్‌ను చైనా కంపెనీలే తయారు చేస్తున్నాయి. దీనివల్ల భారత్‌లో విద్యుత్‌ వాహనాల తయారీ పెంచితే తద్వారా చైనాపై ఆధారపడడం పెరుగుతుందని జీటీఆర్‌ఐ తన నివేదికలో వెల్లడించింది.

ఇంకేం చెప్పిందంటే..?

విద్యుత్‌ వాహనాల వల్ల ఉపాధి అవకాశాలతో పాటు వినియోగదారులు, పరిశ్రమ, ప్రభుత్వ వర్గాలపై పడే ప్రభావాన్నీ తన నివేదికలో జీటీఆర్‌ఐ లేవనెత్తింది. విద్యుత్‌ వాహన ధరలు అధికంగా ఉండడం, దూర ప్రయాణాలకు ఈవీల వినియోగం, భిన్న వాతావరణ పరిస్థితుల్లో పనితీరు, విద్యుత్‌కు డిమాండ్‌, పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌లో వినియోగించలేకపోవడం, కాలుష్యం తగ్గించకపోవడం, ఆటోమొబైల్‌ విడి భాగాల పరిశ్రమపై ప్రభావం, లిథియం అందుబాటు వంటి అంశాలను చర్చించింది. ‘‘ఈవీల వల్ల దీర్ఘకాలంలో ఉపాధి అవకాశాలపై పడే ప్రభావాన్ని, కాలుష్యం, దిగుమతులు, ఆర్థికవృద్ధి వంటి అంశాలనూ చర్చించాల్సిన అవసరం ఉంది’’ అని జీటీఆర్‌ఐ సహ వ్యవస్థాపకులు అజయ్‌ శ్రీవాస్తవ అన్నారు.

500 కేజీల లిథియం కారు బ్యాటరీని తీసుకుంటే అందులో 12 కేజీల లిథియంను వాడుతారు. 15 కేజీల కోబాల్ట్‌, 30 కేజీల నికెల్‌, 44 కేజీల కాపర్‌, 50 కేజీల గ్రాఫైట్‌ వినియోగిస్తారు. అంతేకాకుండా 200 కేజీల దాకా స్టీల్‌, అల్యూమినియం, ప్లాస్టిక్‌ వంటి పదార్థాలను వినియోగిస్తారు. అయితే వీటన్నింటినీ వెలికి తీయడం, రవాణా, ప్రాసెసింగ్‌ వల్ల గాలి, నీటి కాలుష్యం జరుగుతుందని జీటీఆర్‌ఐ తన నివేదికలో పొందుపరిచింది. సాధారణంగా బ్యాటరీ జీవితకాలం ఆరేడేళ్లు ఉంటుందని, ఆ తర్వాత దాన్ని రీసైకిల్‌ చేసే సమయంలోనూ ఉద్గారాలు వెలువడతాయని గుర్తుచేసింది. ఈవీలను ప్రమోట్‌ చేసే సంస్థలేవీ వీటి గురించి మాట్లాడడం లేదని పేర్కొంది. 

విద్యుత్‌ వాహన వినియోగం వల్ల బ్యాటరీ ఛార్జింగ్‌ చేయడానికి బొగ్గు ఆధారిత విద్యుత్‌నే మళ్లీ వినియోగించాల్సి ఉంటుందని జీటీఆర్‌ఐ గుర్తుచేసింది. భారత్‌లో ఉత్పత్తి అయ్యే 60 శాతం విద్యుత్‌ శిలాజ ఇంధనాల నుంచే వస్తోందని పేర్కొంది. విద్యుత్‌ వాహనాల వల్ల విడిభాగాల తయారీలో ఉన్న సంఘటిత, అసంఘటిత తయారీ సంస్థల మనుగడ సైతం ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తంచేసింది. గ్యారేజీలు, షాపులు సైతం మూతపడతాయని తెలిపింది. ఒక్కో విద్యుత్‌ వాహన తయారీ సంస్థ ఒక్కో ఛార్జింగ్‌ పోర్ట్‌ టెక్నాలజీని వాడుతున్నాయని, ప్రామాణికత పాటించడం లేదని తెలిపింది. ఇలాగైతే ఒక్కో కంపెనీ ఒక్కో ఛార్జింగ్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని