Union Budget 2024: వందే భారత్ స్థాయికి 40 వేల సాధారణ కోచ్‌లు

బడ్జెట్‌లో రైల్వేపై కీలక ప్రకటన వెలువడింది. 40 వేల సాధారణ రైలు కోచ్‌లను వందేభారత్‌ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. 

Updated : 01 Feb 2024 13:54 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా రైల్వే వ్యవస్థను మెరుగుపరిచేందుకు, ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు 40 వేల సాధారణ బోగీలను వందే భారత్‌ (Vande Bharat) ప్రమాణాలకు అనుగుణంగా మార్చనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitaraman) తెలిపారు. గురువారం లోక్‌సభలో తాత్కాలిక బడ్జెట్‌ 2024ను (Union Budget 2024) ప్రవేశపెడుతూ ఆమె ఈ ప్రకటన చేశారు. దేశ ఆర్థికాభివృద్ధికి భారతీయ రైల్వే (Indian Railway) ఒక చోదక శక్తిగా పేర్కొన్న విత్త మంత్రి.. ఆ శాఖను మూడు ప్రధాన ఆర్థిక కారిడార్‌లుగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. మొదటిది.. ‘ఇంధన, ఖనిజాలు, సిమెంట్‌ నడవా’ కాగా, రెండోది ‘నౌకా అనుసంధాన నడవా’, మూడోది ‘ట్రాఫిక్‌ డెన్సిటీ కారిడార్‌’ (రవాణా సాంద్రత నడవా)గా పేర్కొన్నారు. వీటిని ప్రధాని ‘గతిశక్తి పథకం’ కింద గుర్తించి వివిధ మార్గాల ద్వారా అనుసంధానించనున్నట్లు తెలిపారు. 

రవాణా సాంద్రత నడవాల ద్వారా ప్యాసింజర్‌ రైళ్ల కార్యకలాపాలు మెరుగుపరిచి వేగవంతమైన, సురక్షితమైన రైలు సర్వీసులు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందులోభాగంగా వందే భారత్‌ వంటి సెమీ-హైస్పీడ్‌ రైళ్లను ఇప్పటికే రైల్వే శాఖ ప్రవేశపెట్టింది. విడతల వారీగా వీటి సర్వీసులను దేశ వ్యాప్తంగా విస్తరిస్తోంది. త్వరలో వందే భారత్‌ స్లీపర్‌ కోచ్‌లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో కంటే వీటిలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు ఉంటాయని రైల్వే వర్గాలు తెలిపాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని