IPO: వచ్చేవారం నాలుగు ఐపీఓలు.. రూ.1,860 కోట్ల సమీకరణ

సోమవారం నుంచి మొదలుకొని వచ్చే వారం మొత్తం నాలుగు కంపెనీలు ఐపీఓకి రానున్నాయి. రూ.1860 కోట్లు సమీకరించనున్నాయి. మరొక కంపెనీ స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్‌ కానుంది.

Published : 11 Dec 2022 10:50 IST

దిల్లీ: వచ్చేవారం నాలుగు కంపెనీలు ఐపీఓకి రానున్నాయి. సులా వైన్‌యార్డ్స్‌, అబన్స్‌ హోల్డింగ్స్‌, ల్యాండ్‌మార్క్‌ కార్స్‌, డ్రోన్‌ఆచార్య ఏరియల్‌ ఇన్నోవేషన్స్‌ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ నాలుగు కలిపి రూ.1,860 కోట్లు సమీకరించనున్నాయి. అలాగే యూనిపార్ట్స్‌ ఇండియా షేర్లు కూడా వచ్చే వారంలోనే స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు కానున్నాయి.

సులా వైన్‌యార్డ్స్‌: దేశంలో ప్రముఖ వైన్‌ తయారీ సంస్థ ‘సులా వైన్‌యార్డ్స్‌’ ఐపీఓ (Sula Vineyards IPO) డిసెంబరు 12న ప్రారంభమై 14న ముగియనుంది. ధరల శ్రేణిని రూ.340-357గా నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద రూ.960 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఐపీఓలో పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (OFS) కింద షేర్లు అందుబాటులో ఉన్నాయి. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న వివిధ రకాల వైన్‌ వేరియంట్ల తయారీలో సులా వైన్‌యార్డ్స్‌ అగ్రస్థానంలో ఉంది. 13 రకాల బ్రాండ్ల పేరిట ఇది వైన్‌ను విక్రయిస్తోంది.

ల్యాండ్‌మార్క్‌ కార్స్‌: ఆటోమొబైల్‌ డీలర్‌షిప్‌ చైన్‌ ల్యాండ్‌మార్క్‌ కార్స్‌ లిమిటెడ్‌ తమ ఐపీఓ (Landmark Cars IPO) ధరల శ్రేణిని రూ.481-506గా నిర్ణయించింది. ఈ కంపెనీ పబ్లిక్ ఇష్యూ డిసెంబరు 13 నుంచి 15 వరకు జరగనుంది. రూ.150 కోట్లు విలువ చేసే తాజా షేర్లతో పాటు రూ.402 కోట్లు విలువ చేసే షేర్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (OFS) కింద ఐపీఓలో అందుబాటులో ఉండనున్నాయి. సమీకరించిన నిధుల నుంచి రూ.120 కోట్లు రుణ భారాన్ని తగ్గించుకోవడానికి, ఇతర సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనున్నారు. ల్యాండ్‌మార్క్‌ కార్స్‌ (Landmark Cars IPO) దేశంలో ప్రీమియం కార్ల రిటైల్‌ విక్రయాలకు వేదికగా ఉంది. ఇది మెర్సిడెస్‌ బెంజ్‌, హోండా, జీప్‌, ఫోక్స్‌వ్యాగన్‌, రెనోకు రిటైల్‌ డీలర్‌గా వ్యవహరిస్తోంది. కొత్త వాహనాల విక్రయాలతో పాటు విడిభాగాలు, ల్యూబ్రికెంట్స్‌, యాక్సెసరీస్‌ విక్రయాలు, మరమ్మతుల వంటి సేవలనూ అందిస్తోంది. అలాగే పాత కార్ల క్రయ విక్రయ వ్యాపారాన్నీ నిర్వహిస్తోంది.

అబన్స్‌ హోల్డింగ్స్‌: ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న అబన్స్‌ హోల్డింగ్స్ ఓ ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ. యూకే, సింగపూర్‌, యూఏఈ, చైనా, మారిషస్‌, భారత్‌లో ఇది కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కంపెనీ ఐపీఓ డిసెంబరు 13 నుంచి 15 వరకు కొనసాగనుంది. ధరల శ్రేణిని రూ.481-506గా నిర్ణయించారు. రూ.552 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మదుపర్లు కనీసం 29 షేర్లకు బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది.

డ్రోన్‌ఆచార్య: దేశంలో తొలి డ్రోన్‌ అంకుర సంస్థ అయిన డ్రోన్‌ఆచార్య ఏరియల్‌ ఇన్నోవేషన్స్‌ (Droneacharya AI IPO) ఐపీఓ సైతం వచ్చేవారంలో ప్రారంభం కానుంది. డిసెంబరు 13 నుంచి డిసెంబరు 15 మధ్య షేర్ల సబ్‌స్క్రిప్షన్‌ ప్రక్రియ కొనసాగనుంది. మొత్తం 62.90 లక్షల షేర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 8.90 లక్షల షేర్లు సంస్థాగత మదుపర్లకు, 11.94 లక్షల షేర్లు అర్హతగల సంస్థాగత మదుపర్లకు, 20.92 లక్షల షేర్లు రిటైల్‌ ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉంచారు. ఇది ఎస్‌ఎంఈ ఐపీఓ. కనీసం 2000 షేర్లకు బిడ్‌ దాఖలు చేయాల్సి ఉంటుంది. అంటే కనీస పెట్టుబడి రూ.1.08 లక్షలు. ఈ షేర్లు కేవలం బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ ఇండెక్స్‌లో మాత్రమే లిస్ట్‌ కానున్నాయి.

యూనిపార్ట్స్‌ లిస్టింగ్‌: వచ్చే సోమవారం యూనిపార్ట్స్‌ ఇండియా (Uniparts India IPO) షేర్లు స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ కానున్నాయి. రూ.548-577 ధరల శ్రేణి వద్ద ఈ కంపెనీ ఐపీఓకి వచ్చిన విషయం తెలిసిందే. నవంబరు 30 నుంచి డిసెంబరు 2 వరకు షేర్ల సబ్‌స్క్రిప్షన్‌ ప్రక్రియ కొనసాగింది. ఐపీఓలో ఈ కంపెనీ షేర్లు 25.3 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని