Paytm: కొత్తగా ఆన్లైన్ వ్యాపారులను చేర్చుకోవద్దు
ఆన్లైన్ మర్చంట్ల (వ్యాపారుల)ను కొత్తగా జత చేర్చుకోకుండా, పేటీఎం పేమెంట్స్ సర్వీసెస్ (పీపీఎస్ఎల్)పై తాత్కాలికంగా నిషేధం విధిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశాలు జారీ చేసింది.
పేటీఎమ్ పేమెంట్స్ సర్వీసెస్కు ఆర్బీఐ ఆదేశాలు
దిల్లీ: ఆన్లైన్ మర్చంట్ల (వ్యాపారుల)ను కొత్తగా జత చేర్చుకోకుండా, పేటీఎం పేమెంట్స్ సర్వీసెస్ (పీపీఎస్ఎల్)పై తాత్కాలికంగా నిషేధం విధిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశాలు జారీ చేసింది. ఈ చర్య వల్ల వ్యాపారంపై ఎటువంటి ప్రభావం ఉండదని కంపెనీ చెబుతోంది.
డిసెంబరు 2020లో దరఖాస్తు
పేటీఎమ్ మాతృసంస్థ ఒన్97 కమ్యూనికేషన్స్ (ఓసీఎల్), తన చెల్లింపు అగ్రిగేటర్ సేవల వ్యాపారాన్ని పేటీఎమ్ పేమెంట్స్ సర్వీసెస్కు బదిలీ చేయడం ద్వారా పేమెంట్ అగ్రిగేటర్(పీఏ) మార్గదర్శకాలను పాటించడం కోసం 2020 డిసెంబరులో ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపింది. ఆ దరఖాస్తును ఆర్బీఐ తిరస్కరించింది. 2021 సెప్టెంబరులో మళ్లీ పేటీఎం తన ప్రతిపాదన సమర్పించింది. ఈ నేపథ్యంలోనే ఆర్బీఐ నుంచి పీపీఎస్ఎల్కు తాజా లేఖ అందిందని పేటీఎమ్ పేర్కొంది. ‘పీపీఎస్ఎల్లోకి కొద్ది కాలంగా వచ్చిన పెట్టుబడులకు, ఎఫ్డీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా అవసరమైన అనుమతి కోరాలి. కొత్తగా ఆన్లైన్ మర్చంట్లను తీసుకోవద్దు’ అని ఈ లేఖలో ఆర్బీఐ సూచించింది.
120 రోజుల్లోగా తిరిగి దరఖాస్తు
పీఏ దరఖాస్తును 120 రోజుల్లోగా సమర్పించగలమని పేటీఎమ్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. దరఖాస్తు పెండింగ్లో ఉన్నంత కాలం కొత్త మర్చంట్లను తీసుకోబోమని వివరించింది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. ఒకే సంస్థ ఇ-కామర్స్ కార్యకలాపాలు, పీఏ సేవలు అందించరాదు. కచ్చితంగా విడిపోవాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.