పరిమిత శ్రేణిలో చలనాలు

కీలక సూచీలు ఈవారం చాలా తక్కువ శ్రేణికి లోబడి చలించొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) పరపతి విధాన సమావేశ నిర్ణయాలు, అంతర్జాతీయ మార్కెట్ల కదలికలు, 8న వెలువడే గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలపై మదుపర్ల దృష్టి ఉండొచ్చు. 

Published : 05 Dec 2022 04:07 IST

ఆర్‌బీఐ ఎంపీసీ నిర్ణయాలు కీలకం
అంతర్జాతీయ మార్కెట్లు, గుజరాత్‌ ఎన్నికలపైనా దృష్టి
విశ్లేషకుల అంచనాలు
స్టాక్‌ మార్కెట్‌ ఈ వారం

కీలక సూచీలు ఈవారం చాలా తక్కువ శ్రేణికి లోబడి చలించొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) పరపతి విధాన సమావేశ నిర్ణయాలు, అంతర్జాతీయ మార్కెట్ల కదలికలు, 8న వెలువడే గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలపై మదుపర్ల దృష్టి ఉండొచ్చు.  సోమవారం ప్రారంభమై, బుధవారం ముగిసే ఆర్‌బీఐ ఎంపీసీ కమిటీ సమావేశం ‘రెపో రేటును 35 బేసిస్‌ పాయింట్ల మేర పెంచుతూ నిర్ణయం తీసుకోవచ్చనే’ అంచనాలున్నాయి.    ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వ్యాఖ్యలను మార్కెట్‌ సునిశితంగా గమనించొచ్చు. నిఫ్టీ-50కి 19,000 స్థాయిలో నిరోధం ఎదురుకావొచ్చని, 18,300 వద్ద మద్దతు కనిపించొచ్చనీ  విశ్లేషకులు భావిస్తున్నారు. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే

* కమొడిటీ ధరల దిద్దుబాటు కారణంగా ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీలు అధిక లాభాలు అందుకుంటాయన్న అంచనాల మధ్య ఈ రంగ షేర్లు కొత్త గరిష్ఠాలకు చేరొచ్చు.

* ఐటీ షేర్లలో కొనుగోళ్లు కొనసాగొచ్చు. అమెరికాలో స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండడం ఇందుకు కారణం. ఇటీవల నిఫ్టీ ఐటీ సూచీ 11 నెలల దిద్దుబాటు నుంచి బయటపడింది.  

* యంత్ర పరికరాల షేర్లు చాలా తక్కువ శ్రేణికి లోబడి కదలాడొచ్చు. తయారీ రంగంలో క్షీణత వల్ల జులై-సెప్టెంబరులో జీడీపీ 6.3 శాతానికి పరిమితమవ్వడాన్ని మరవద్దు. భారీ ఆర్డరు నేపథ్యంలో గత వారం 10.5 శాతం మేర రాణించిన భెల్‌ షేర్లు వెలుగులోకి రావొచ్చు.

* ఔషధ రంగ షేర్లు స్తబ్దుగా చలించొచ్చు. నిఫ్టీ ఫార్మా సూచీ ఈ వారం 13,700 పాయింట్లను దాటి ముందుకు వెళ్లకపోవచ్చని అంచనా. 12800 వద్ద మద్దతు కనిపిస్తోంది. ఫ్లూ సీజను కావడంతో కొన్ని కంపెనీలు అధిక అమ్మకాలను సాధిస్తున్నందున ఆయా షేర్లలో కదలికలు కనిపించొచ్చు.  

* ఎటువంటి సానుకూలతలూ లేనందున లోహ షేర్లు తమ లాభాలు కొనసాగించడానికి ఇబ్బంది పడొచ్చు. అయితే ఉక్కుకు అంతర్జాతీయంగా గిరాకీ బలహీనంగా ఉండడం ప్రతికూలాంశం.

* ఎంపిక చేసిన టెలికాం షేర్లలో చలనాలకు వీలుంది. 5జీ సేవల ఆవిష్కరణ పరిణామాలపై మార్కెట్‌ దృష్టి ఉండొచ్చు. ఇప్పటికే పలు నగరాల్లో సేవలను ప్రారంభించిన భారతీ ఎయిర్‌టెల్‌పై బ్రోకరేజీలు సానుకూలంగా ఉన్నాయి.  

* ముడి చమురు ధరల ఆధారంగా ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియా వంటి అప్‌స్ట్రీమ్‌ కంపెనీల షేర్లు కదలాడొచ్చు. రష్యా ముడి చమురుపై ఐరోపా దేశాల నిర్ణయం, ఒపెక్‌ దేశాల సమావేశం కారణంగా చమురు ధరలు ఊగిసలాటలకు గురికావొచ్చు.

* ఎటువంటి ప్రధాన వార్తలూ లేనందున వాహన కంపెనీల షేర్లు స్తబ్దుగా కదలాడవచ్చు. అంచనాలకు తగ్గట్లుగా నవంబరులో టోకు విక్రయాలు భారీగా నమోదయ్యాయి. 9న వెలువడే రిటైల్‌ గణాంకాలను మదుపర్లు గమనించొచ్చు.  

* సిమెంటు ధర పెరగొచ్చన్న అంచనాలకు తోడు గిరాకీ పుంజుకుంటుండడంతో ఈ రంగ షేర్లు రాణించొచ్చు.  

* బ్యాంకింగ్‌ షేర్లలో సానుకూలతలు కొనసాగొచ్చు. నిఫ్టీ బ్యాంక్‌ సూచీకి 42,800 వద్ద మద్దతు లభించొచ్చు. 44,000-44,500 మధ్య నిరోధం ఎదురుకావొచ్చు. యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లపై సానుకూలతలు కనిపించొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని