సంక్షిప్త వార్తలు(4)

హైదరాబాద్‌కు చెందిన బ్రైట్‌కామ్‌ గ్రూపు (బీసీజీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి కన్సాలిడేటెడ్‌ ఖాతాల ప్రకారం రూ.1,683 కోట్ల ఆదాయాన్ని, రూ.320 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది.

Updated : 05 Feb 2023 06:35 IST

బ్రైట్‌కామ్‌ గ్రూపు లాభం రూ.320 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన బ్రైట్‌కామ్‌ గ్రూపు (బీసీజీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి కన్సాలిడేటెడ్‌ ఖాతాల ప్రకారం రూ.1,683 కోట్ల ఆదాయాన్ని, రూ.320 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోల్చితే ఆదాయం 52.48 శాతం, నికరలాభం 51.15 శాతం పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది. యూఎస్‌, ఐరోపా దేశాల్లో వ్యాపార కార్యకలాపాలు విస్తరించినందున అధిక ఆదాయాలు నమోదు చేసే అవకాశం వచ్చినట్లు పేర్కొంది. అంతేగాక భవిష్యత్తులో వృద్ధి బాటలో కొనసాగేందుకు వీలుగా ‘హైగ్రోత్‌ మోడల్‌’ను అనుసరించనున్నట్లు వివరించింది.  


1 కువైట్‌ దినార్‌...  రూ.266.64

ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీ ఇదే

ప్రపంచంలోనే బలమైన కరెన్సీలు అనగానే.. మనకు గుర్తొచ్చేవి అమెరికా డాలరు, గ్రేట్‌ బ్రిటన్‌ పౌండ్‌, యూరోలే. అయితే 2023లో ఈ మూడు కూడా అత్యంత విలువైనవి కావు. ఒక అమెరికా డాలరుకు మహా అయితే రూ.82 వస్తాయి. అదే యూరో, పౌండ్‌లకైతే.. రూ.88, రూ.100 వరకు వస్తాయి. అయితే వీటన్నికంటే విలువైనది ఒకటి ఉంది. అదేంటంటే.. కువైట్‌ దినార్‌. ఆ దేశ స్థిర ఆర్థిక వ్యవస్థ రీత్యా కువైట్‌ దినార్‌ అత్యంత విలువైన కరెన్సీగా కొనసాగుతోంది. తాజాగా ఒక కువైట్‌ దినార్‌ విలువ రూ.266.64కు చేరింది. బెహ్రెయిన్‌ దినార్‌(రూ.215.90), ఒమిని రియాల్‌(రూ.211.39)లు కూడా విలువైన కరెన్సీల్లో ముందు వరుసలో నిలిచాయి.


ఇండస్‌ టవర్స్‌లో23% వాటా ఎయిర్‌టెల్‌ కొనుగోలు
దిల్లీ: టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ తమ పూర్తి స్థాయి అనుబంధ సంస్థ నెటిల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వద్ద ఉన్న 23.01 శాతం ఇండస్‌ టవర్స్‌ షేర్లను కొనుగోలు చేసినట్లు నియంత్రణ సంస్థలకు శనివారం సమాచారమిచ్చింది. దీంతో ప్రస్తుతం ఇండస్‌ టవర్స్‌లో భారతీ ఎయిర్‌టెల్‌ వాటా 47.95 శాతానికి చేరింది. గతంలో ఈ సంస్థకు ఇండస్‌ టవర్స్‌లో 24.94 శాతం వాటా నేరుగా ఉండగా, అనుబంధ సంస్థ నెటిల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ద్వారా 23.01 శాతం వాటా ఉంది. ఇప్పుడు ఆ సంస్థ నుంచి వాటాను కొనుగోలు చేయడంతో నేరుగా 47.95 శాతం వాటా సొంతం చేసుకుంది.


సంక్షిప్తంగా

* రిలయన్స్‌ జియో తాజాగా హరిద్వార్‌లోనూ 5జీ సేవలను ప్రారంభించింది.

* క్వెస్‌ కార్ప్‌ డిసెంబరు త్రైమాసికంలో రూ.85.63 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ ఆర్జించిన నికర లాభం రూ.88.51 కోట్లతో పోలిస్తే ఇది 3.25% తక్కువ. కార్యకలాపాల ఆదాయం రూ.3,684.98 కోట్ల నుంచి 21.18 శాతం పెరిగి రూ.4,465.55 కోట్లకు చేరింది.

* దిగ్గజ కమొడిటీ ఎక్స్ఛేంజ్‌ ఎంసీఎక్స్‌ డిసెంబరు త్రైమాసికంలో రూ.38.79 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఆర్జించిన రూ.34.46 కోట్లతో పోలిస్తే ఇది 12.5% ఎక్కువ. మొత్తం ఏకీకృత ఆదాయం రూ.104.06 కోట్ల నుంచి రూ.163.65 కోట్లకు చేరింది.

* ప్రిఫరెన్షియల్‌ కేటాయింపు పద్ధతిలో 37.75 కోట్ల షేర్లను అనుబంధ సంస్థ ఐడీఎఫ్‌సీకి జారీ చేయడం ద్వారా రూ.2,196 కోట్లను సమీకరించేందుకు ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ బోర్డు ఆమోదం తెలిపింది.

* డెర్మటైటిస్‌, ఎగ్జిమా, సోరియాసిస్‌ వంటి చర్మ వ్యాధుల చికిత్సలో వినియోగించే క్రీము ట్యూబులను (5,720) అమెరికా విపణి నుంచి వెనక్కి పిలిపిస్తున్నట్లు(రీకాల్‌) లుపిన్‌ అనుబంధ సంస్థ తెలిపింది.

* పేటెంట్‌ ఉల్లంఘన కేసులో హైకోర్టు తీర్పును పట్టించుకోకుండా కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు త్రివేణి ఇంటర్‌కెమ్‌, ఫైజర్‌కు 2 వారాల్లోగా రూ.2 కోట్లు చెల్లించాలని దిల్లీ హైకోర్టు ఆదేశించింది.

* 2018లో టెస్లా ఒప్పందానికి సంబంధించి ట్వీట్ల ద్వారా ఎలాన్‌ మస్క్‌ మదుపర్లను మోసం చేయలేదని దీనిపై విచారించిన జ్యూరీ వెల్లడించింది.

* అంతర్జాతీయ బాండ్ల సూచీలో భారత్‌ చేరాలనుకుంటే, దేశీయ విధానాలకు అనుగుణంగా వెళుతుందే తప్ప విదేశీ మదుపర్లకు సరిపోయేలా నిబంధనలు మార్చబోమని ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్‌ అన్నారు.

* భారతీ ఎయిర్‌టెల్‌ తమ పూర్తి స్థాయి అనుబంధ సంస్థ నెటిల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వద్ద ఉన్న 23.01% ఇండస్‌ టవర్స్‌ షేర్లను కొనుగోలు చేసింది. దీంతో ప్రస్తుతం ఇండస్‌ టవర్స్‌లో భారతీ ఎయిర్‌టెల్‌ వాటా 47.95 శాతానికి చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని