ఈ ఏడాది వేతన పెంపు 10.2%!

దేశంలో ఈ ఏడాది సరాసరి వేతన పెంపు 2022తో పోలిస్తే 10.2 శాతం ఎక్కువగా ఉండొచ్చని ఈవై నివేదిక వెల్లడించింది.

Updated : 22 Mar 2023 02:47 IST

ఇ-కామర్స్‌లో అధికం: ఈవై నివేదిక

దిల్లీ: దేశంలో ఈ ఏడాది సరాసరి వేతన పెంపు 2022తో పోలిస్తే 10.2 శాతం ఎక్కువగా ఉండొచ్చని ఈవై నివేదిక వెల్లడించింది. ‘ఫ్యూచర్‌ ఆఫ్‌ పే 2023’ పేరుతో రూపొందించిన నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది. ఇ-కామర్స్‌, వృత్తి సేవలు, ఐటీ రంగాల్లో వేతనాలు అధికంగా పెరగొచ్చని అభిప్రాయపడింది. గత ఏడాది సరాసరి వేతన పెంపు 2021తో పోలిస్తే 10.4 శాతం అధికంగా ఉండటం గమనార్హం. బ్లూ కాలర్‌ ఉద్యోగాలు కాకుండా మిగతా అన్ని ఉద్యోగ స్థాయుల్లో వేతన పె2ంపు ఈ ఏడాది తక్కువగానే ఉండొచ్చని నివేదిక అంచనా వేసింది.

ఆ మూడు రంగాల్లోనే..: అధిక వేతన పెంపు ఉండొచ్చని అంచనా వేస్తున్న 3 రంగాలూ (ఇ-కామర్స్‌, వృత్తి సేవలు, ఐటీ) సాంకేతికతతో ముడిపడినవే. ఇ-కామర్స్‌ రంగంలో 12.5%, వృత్తి సేవల రంగంలో 11.9%, ఐటీలో 10.8% మేర వేతనాలు పెరగొచ్చు. 2022లో ఈ 3 రంగాల్లో వరుసగా 14.2 శాతం, 13 శాతం, 11.6 శాతం చొప్పున వేతనాలు పెరిగాయి.

నిలకడగా వలసల రేటు: ఉద్యోగుల సగటు వలసల రేటు 2022లో 21.2 శాతంగా నమోదైంది. 2021 స్థాయి కంటే ఇది తక్కువ. స్వచ్ఛంద వలసల రేటు 16.8 శాతంగా ఉంది. స్వచ్ఛందేతర వలసల రేటు 3.6 శాతంగా నమోదైంది. కెరీర్‌లో వృద్ధి అవకాశాలు తక్కువగా ఉండటం, గుర్తింపు లేకపోవడం, వేతనాల్లో అసమానతలు వంటివి స్వచ్ఛంద వలసలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి.

* ఆర్థిక సంస్థలు, ఇ-కామర్స్‌, టెక్నాలజీ రంగాలు అత్యధిక వలసల రేటు నమోదు చేశాయి. ఈ రంగాల్లో వరుసగా 28.3 శాతం, 27.7 శాతం, 22.1 శాతం చొప్పున ఉద్యోగులు వలసపోయారు.

* తక్కువ వలసల రేటు ఉన్న రంగాలు.. లోహ, గనుల రంగం (8.2%), ఆతిథ్య రంగం (9.1% ), ఏరోస్పేస్‌ రంగం (10.9%).

* కృత్రిమ మేధ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వంటి సాంకేతిక నైపుణ్యాలకు అధిక గిరాకీ కనిపిస్తోంది. సాధారణ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల కంటే ఈ నైపుణ్యాలున్న వారికి 15-20% అధిక వేతనం లభిస్తుండటం విశేషం. రిస్క్‌ మోడలింగ్‌, డేటా ఆర్కిటెక్చర్‌, బిజినెస్‌ అనలిటిక్స్‌ వంటి అనలిటిక్స్‌ నైపుణ్యాలు ఉన్న వారికి 20-25% అదనపు వేతనాలు లభిస్తున్నాయి. సుమారు 48% కంపెనీలు నైపుణ్యాలున్న వారికి 22% అధికంగా చెల్లించడంతో పాటు ఏకకాల బోనస్‌లు కూడా అందిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని