అనధికార కాల్స్‌, సందేశాల నిరోధానికి ట్రాయ్‌ చర్యలు

అనధికార కాల్స్‌, సందేశాలను నియంత్రించేందుకు ఇప్పటికే కంపెనీలు చర్యల్ని ముమ్మరం చేశాయని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ తెలిపింది.

Published : 29 Mar 2023 03:28 IST

దిల్లీ: అనధికార కాల్స్‌, సందేశాలను నియంత్రించేందుకు ఇప్పటికే కంపెనీలు చర్యల్ని ముమ్మరం చేశాయని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ తెలిపింది. ఉత్పత్తుల ప్రచారం చేస్తూ వివిధ కంపెనీల నుంచి వచ్చే ఫోన్‌కాల్స్‌ నుంచి వినియోగదారులకు ఊరట కల్పించేందుకు ట్రాయ్‌ చర్యలు తీసుకుంటోంది. చందాదారులను ఇబ్బంది పెడుతున్న ప్రచార సందేశాలు, కాల్స్‌ను నియంత్రించేందుకు చేపట్టాల్సిన పలు ఆదేశాలను జారీ చేసింది. ముఖ్యంగా ఇలాంటి కాల్స్‌ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అధికంగా వస్తుంటాయి. ఈ నేపథ్యంలో వీటిని నిలువరించేందుకు అగ్రగామి టెలికాం సంస్థలు భారతీ ఎయిర్‌టెల్‌, జియో, వొడాఫోన్‌ ఐడియాతో ట్రాయ్‌ సమీక్ష నిర్వహించింది. వినియోగదారులను ఇబ్బంది పెట్టే అనధికార ప్రచార సందేశాలు, కాల్స్‌ను నియంత్రించాలని ఆదేశించింది. ఇవే ఒక్కోసారి మోసాలు, స్కామ్‌లకు కారణమవుతున్నాయని వివరించింది. మోసపూరిత సందేశాలను పసిగట్టగలిగే కృత్రిమ మేధ/మెషీన్‌ లెర్నింగ్‌ ఆధారిత వ్యవస్థను ఈ సమీక్షా సమావేశంలో వొడాఫోన్‌ ఐడియా ట్రాయ్‌ ముందుంచింది. దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు వీఐకి అనుమతి ఇచ్చింది. దాని ఫలితం ఆధారంగా ఇలాంటి పరిష్కారాల అమలుకు తగిన నిబంధనలతో మార్గదర్శకాలను తీసుకొస్తామని ట్రాయ్‌ స్పష్టం చేసింది. ప్రస్తుతం అనధికార ప్రచార సందేశాలను అరికట్టేందుకు అమలు చేస్తున్న బ్లాక్‌చైన్‌ ఆధారిత ‘డిస్టిబ్య్రూటెడ్‌ లెడ్జర్‌ టెక్నాలజీ’ని మే 1 నుంచి కాల్స్‌కు కూడా వర్తింపజేస్తామని తెలిపింది

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని