విమానాల పార్కింగుకు అధిక ఛార్జీలు!

సాంకేతిక, ఇతర సమస్యల కారణంగా విమానాలను నిలిపివేస్తున్న (గ్రౌండింగ్‌) సందర్భాలు పెరుగుతున్నాయి. కార్యకలాపాలు సాగించని ఇలాంటి విమానాలను నిలిపి ఉంచడం వల్ల, దిల్లీ విమానాశ్రయంలో అందుబాటులో ఉన్న పార్కింగ్‌ స్థలం తగ్గిపోతోంది.

Published : 04 Dec 2023 04:36 IST

దిల్లీ విమానాశ్రయ యోచన

దిల్లీ: సాంకేతిక, ఇతర సమస్యల కారణంగా విమానాలను నిలిపివేస్తున్న (గ్రౌండింగ్‌) సందర్భాలు పెరుగుతున్నాయి. కార్యకలాపాలు సాగించని ఇలాంటి విమానాలను నిలిపి ఉంచడం వల్ల, దిల్లీ విమానాశ్రయంలో అందుబాటులో ఉన్న పార్కింగ్‌ స్థలం తగ్గిపోతోంది. రోజువారీ కార్యకలాపాలు సాగించే విమానాలు నిలిపేందుకు చోటు సరిపోవడం లేదు. ఇది విమానాశ్రయ కార్యకలాపాల  సామర్థ్యాన్నీ ప్రభావితం చేస్తోంది. అందువల్ల కార్యకలాపాలు నిర్వహించకుండా, మరమ్మతుల కోసం నిలిపి ఉంచిన విమానాలకు ఇకపై విమానయాన సంస్థల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేయాలని దిల్లీ విమానాశ్రయాన్ని నిర్వహించే దిల్లీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (డీఐఏఎల్‌) ప్రణాళిక సిద్ధం చేసింది. నిర్ణీత కాల వ్యవధికి మించి విమానాశ్రయంలో నిలిపి ఉంచిన విమానాలకు ఆయా సంస్థల నుంచి అధిక మొత్తంలో ఛార్జీలు వసూలు చేయాలనుకుంటున్నట్లు డీఐఏఎల్‌ సీఈఓ విదేహ్‌ కుమార్‌ వెల్లడించారు. తదుపరి విమాన ట్రాఫిక్‌ సమీక్షను వచ్చే ఏడాది ప్రారంభంలో చేయనున్నారు.

  • నవంబరు 17 నాటికి ఇండిగో, స్పైస్‌జెట్‌, ఎయిరిండియా తదితర విమానయాన సంస్థలు 64 విమానాలను దిల్లీ విమానాశ్రయ ప్రాంగణంలో నిలిపి ఉంచాయని డీఐఏఎల్‌ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఇండిగో విమానాలు 24, స్పైస్‌జెట్‌ విమానాలు 6, ఎయిరిండియా విమానాలు 2, అలియన్స్‌ ఎయిర్‌ విమానం ఒకటి చొప్పున విమానాశ్రయ  ఆవరణలో నిలిపి ఉంచినట్లు పేర్కొన్నారు.
  • కార్యకలాపాలు సాగించని విమానయాన సంస్థ గోఫస్ట్‌ 23 విమానాలను అక్కడే నిలిపి ఉంచింది. జూమ్‌ ఎయిర్‌ విమానాలు 5, జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానాలు 3 కూడా ఇక్కడే ఆగి ఉన్నాయని తెలిపారు.
  • ప్రస్తుతం డీఐఏఎల్‌ నిర్వహిస్తున్న ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఏఐ)లో 295 విమాన పార్కింగ్‌ స్టాండ్లు ఉన్నాయి.
  • ప్రస్తుతం దిల్లీ విమానాశ్రయంలో మూడు టెర్మినల్స్‌ (టీ1, టీ2, టీ3) ద్వారా సుమారు 1,300-1,500 విమానాలు రోజువారీగా రాకపోకలు సాగిస్తున్నాయి. ట్రాఫిక్‌ ధోరణిని గమనించి టీ4 టెర్మినల్‌ ఏర్పాటుపై త్వరలోనే సంస్థ ఒక నిర్ణయం తీసుకోబోతోంది. 2024 మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ విమానాశ్రయం నుంచి 7 కోట్ల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరే అవకాశం ఉందని డీఐఏఎల్‌ వెల్లడించింది. జీఎంఆర్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలోని కన్సార్షియమే డీఐఏఎల్‌.

దేశంలో వృథాగా 166 విమానాలు

విమానయాన రంగ సలహా సంస్థ కాపా ఇండియా నివేదిక ప్రకారం, ఇండిగో, ఎయిరిండియా, గోఫస్ట్‌, స్పైస్‌జెట్‌ సంస్థలకు చెందిన 161-166 విమానాలు దేశంలో కార్యకలాపాలు సాగించకుండా నిలిపి ఉన్నాయి. మార్చి నాటికి ఈ సంఖ్య 196-201కి చేరే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని