తుపాను బాధిత ప్రాంతాల్లోని వినియోగదార్లకు వాహన సంస్థల మద్దతు

ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడుల్లో మిగ్‌జాం తుపాను, వరదల వల్ల ఇబ్బంది పడుతున్న వినియోగదార్లకు మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, హ్యుందాయ్‌ మోటార్‌, ఆడి, ఫోక్స్‌వ్యాగన్‌ తదితర వాహన సంస్థలు మద్దతుగా నిలుస్తున్నాయి.

Published : 07 Dec 2023 01:34 IST

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడుల్లో మిగ్‌జాం తుపాను, వరదల వల్ల ఇబ్బంది పడుతున్న వినియోగదార్లకు మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, హ్యుందాయ్‌ మోటార్‌, ఆడి, ఫోక్స్‌వ్యాగన్‌ తదితర వాహన సంస్థలు మద్దతుగా నిలుస్తున్నాయి. మారుతీ తమ డీలర్‌ భాగస్వాములతో కలిసి వర్క్‌షాప్‌ల్లో అనేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. తుపాను, వరదల ప్రభావం నుంచి కార్లను సురక్షితంగా ఎలా కాపాడుకోవాలో సూచిస్తూ, ముందస్తుగా 7 లక్షల ఎస్‌ఎంఎస్‌ అలర్ట్‌లను తమ వినియోగదార్లకు పంపించింది. 46 ట్రక్కులను  సమీకరించింది. వేగంగా స్పందించేందుకు 34 రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌ వాహనాలను సిద్ధం చేసింది. ఆగ్‌మెంటెడ్‌ విడిభాగాల ఇన్వెంటరీని అందుబాటులో ఉంచింది. బీమా సంస్థలతో కలిసి వేగంగా క్లెయిమ్‌ల ప్రాసెసింగ్‌, పరిష్కారంపై దృష్టి పెట్టింది.

  • మహీంద్రా అండ్‌ మహీంద్రా కూడా కాంప్లిమెంటరీ రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌, నో-కాస్ట్‌ ఇన్‌స్పెక్షన్‌, డామేజ్‌ అసెస్‌మెంట్‌, ప్రత్యేక రాయితీ రూపంలో ఆర్థిక మద్దతు అందించినట్లు తెలిపింది.
  • చెన్నైలో 24/7 కాంప్లిమెంటరీ రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌ అందిస్తున్నట్లు ఆడి ఇండియా హెడ్‌ బల్బీర్‌ సింగ్‌ ధిల్లాన్‌ తెలిపారు.
  • హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియాకు చెందిన సీఎస్‌ఆర్‌ సంస్థ హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా ఫౌండేషన్‌ (హెచ్‌ఎంఐఎఫ్‌) తమిళనాడులో తుపాను బాధిత కమ్యూనిటీలకు రూ.3 కోట్ల ఆర్థిక మద్దతు ప్రకటించింది. కంపెనీ బృందాలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి ఆహారం, నీరు, వసతి, వైద్య సాయం వంటివి అందిస్తున్నాయి.
  • జర్మనీ వాహన సంస్థ ఫోక్స్‌వ్యాగన్‌ ఇండియా, చెన్నైలోని వరద ప్రభావిత ప్రాంతాల్లోని వినియోగదార్లకు ప్రయార్టీ కాంప్రెహెన్సివ్‌ చెక్స్‌ (తనిఖీలు) అందిస్తోంది. డీలర్ల వద్ద సరిపడినన్ని విడిభాగాలు ఉండేలా చూడటంతో పాటు మరమ్మతు కోసం సరిపడా సిబ్బందిని అందుబాటులో ఉంచింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని