Trading: టి+0 సెటిల్‌మెంట్‌.. ప్రయోజనమేనా?

ప్రస్తుతం మనం స్టాక్‌ మార్కెట్లో ఏదైనా షేర్లు కొనుగోలు చేస్తే టి+1 రోజున అంటే ట్రేడ్‌ చేసిన తదుపరి రోజున సెటిల్‌మెంట్‌ జరుగుతోంది.

Updated : 24 Mar 2024 08:09 IST

ప్రస్తుతం మనం స్టాక్‌ మార్కెట్లో ఏదైనా షేర్లు కొనుగోలు చేస్తే టి+1 రోజున అంటే ట్రేడ్‌ చేసిన తదుపరి రోజున సెటిల్‌మెంట్‌ జరుగుతోంది. అయితే టి+0తో ట్రేడ్‌ జరిగిన రోజే సెటిల్‌మెంట్‌ పూర్తవుతుంది.

ఎప్పటి నుంచి: ప్రస్తుతానికి సెబీ ఈ సెటిల్‌మెంట్‌పై నమూనా పరీక్షలను నిర్వహించనుంది. మార్చి 28, 2024 నుంచి బీటా వర్షన్‌ను ఆవిష్కరించనుంది.

25 షేర్లకే: టి+0 సెటిల్‌మెంట్‌ను కేవలం 25 షేర్లు, పరిమిత బ్రోకర్లకు మాత్రమే మొదలుపెట్టనున్నారు. తద్వారా వ్యవస్థ సామర్థ్యాన్ని పరిశీలించనున్నారు. అన్ని షేర్లకు ఒకే రోజు సెటిల్‌మెంట్‌ను అమలు చేయడానికి ముందు ఈ 25 షేర్లపై జరిపే పరీక్షా ఫలితాలను బట్టి సమీక్షిస్తారు.

ఎన్ని రోజులు: మూడు, ఆరు నెలల చివర ఈ పరీక్షల ప్రగతిని సెబీ పరీక్షించనుంది. అన్ని సజావుగా జరిగితే విస్తృత స్థాయిలో టి+0 అమల్లోకి వస్తుంది. బీటా వర్షన్‌ వినియోగదార్లతో పాటు అన్ని వర్గాలతో చర్చించిన అనంతరం అమలు తేదీపై సెబీ ఒక నిర్ణయానికి వస్తుంది.

ప్రయోజనం ఏంటంటే: టి+0 సెటిల్‌మెంట్‌ వల్ల బ్రోకర్ల సొంత నిధులను వాడాల్సిన అవసరం పెద్దగా ఉండకపోవచ్చు. తద్వారా మొత్తం మీద వ్యాపార వ్యయాలు తగ్గుతాయి. ప్రస్తుతం ఎవరైనా క్లయింటు షేర్లను విక్రయిస్తే.. తక్షణం అందుకు సంబంధించిన మొత్తం ట్రేడింగ్‌ ఖాతాలో పడిపోతోంది. ఆ మొత్తంతో షేర్ల కొనుగోళ్లు చేయడానికి వీలవుతుంది. ఇక ఎక్స్ఛేంజీ మాత్రం ఆ బ్రోకర్‌కు టి+1 రోజున మాత్రమే ఆ నిధులను జమ చేస్తూ వచ్చింది.

టి+0 అమల్లోకి వస్తే..: సాయంత్రం 4:30 గంటలకల్లా బ్రోకర్లకు నిధులు జమవుతాయి. అంటే బ్రోకర్లకు నిధులు రావడానికి పెద్ద సమయం పట్టదన్నమాట.

తక్షణ సెటిల్‌మెంట్‌ వల్ల మార్కెట్లో ద్రవ్యలభ్యత పెరుగుతుంది. అదే సమయంలో భారత స్టాక్‌ మార్కెట్ల సామర్థ్యం, పారదర్శకత మెరుగవుతుంది.

టి+5 నుంచి టి+0 దాకా

అప్పటి దాకా ఉన్న టి+5 సెటిల్‌మెంట్‌ను ఏప్రిల్‌ 2002లో టి+3కి సెబీ మార్చగలిగింది. ఆ తర్వాతి సంవత్సరమే టి+2కు సవరించింది. 2021లో టి+1ను దశలవారీగా అమలు చేయడం ప్రారంభించింది. తుది దశను జనవరి 2023కు పూర్తి చేసింది. అక్టోబరు 1, 2023 నుంచి టి+1 సెటిల్‌మెంట్‌ను అన్ని స్క్రిప్‌లకు అమలు చేయనున్నట్లు సెబీ ప్రకటించింది. ప్రస్తుతం చాలా వరకు దేశాల్లో రెండు రోజుల్లో సెటిల్‌మెంట్‌ జరుగుతోంది. తక్షణ సెటిల్‌మెంట్‌ భారత్‌లో వస్తే.. చైనా తర్వాత ఆ ఘనత సాధించిన దేశం మనదే అవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు