ద్రవ్యలోటు రూ.15 లక్షల కోట్లు

ఫిబ్రవరి చివరి నాటికి ప్రభుత్వ ద్రవ్యలోటు రూ.15 లక్షల కోట్లుగా నమోదైంది. బడ్జెట్‌లో సవరించిన వార్షిక లక్ష్యం రూ.17.35 లక్షల కోట్లలో ఇది 86.5 శాతమని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

Published : 29 Mar 2024 01:17 IST

ఫిబ్రవరి చివరికే బడ్జెట్‌ లక్ష్యంలో 86.5 శాతానికి

దిల్లీ: ఫిబ్రవరి చివరి నాటికి ప్రభుత్వ ద్రవ్యలోటు రూ.15 లక్షల కోట్లుగా నమోదైంది. బడ్జెట్‌లో సవరించిన వార్షిక లక్ష్యం రూ.17.35 లక్షల కోట్లలో ఇది 86.5 శాతమని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఏడాదిక్రితం ఇదే సమయంలో ద్రవ్యలోటు అప్పటి బడ్జెట్‌ లక్ష్యంలో 82.8 శాతంగా ఉంది. ప్రభుత్వ ఆదాయాలు, వ్యయాల వ్యత్యాసాన్ని ద్రవ్యలోటుగా వ్యవహరిస్తారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో 5.8 శాతం (రూ.17.35 లక్షల కోట్లు)గా ఉండొచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ (సీజీఏ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2024 ఫిబ్రవరి వరకు ప్రభుత్వానికి ఆదాయాల రూపంలో రూ.22.45 లక్షల కోట్లు వచ్చాయి. ఇది బడ్జెట్‌ అంచనాలో 81.5 శాతం. ఇందులో పన్నుల ఆదాయం రూ.18.49 లక్షల కోట్లు కాగా. పన్నేతర ఆదాయం రూ.3.6 లక్షల కోట్లుగా ఉంది. నాన్‌డెట్‌ కేపిటల్‌ రిసీట్స్‌ కింద రూ.36,140 కోట్లు వచ్చాయి. మొత్తం వ్యయాలు రూ.37.47 లక్షల కోట్లు కాగా.. బడ్జెట్‌ అంచనాలో ఈ విలువ 83.5 శాతం. ఇందులో రెవెన్యూ వ్యయాలు రూ.29.41 లక్షల కోట్లు, మూలధన వ్యయాలు రూ.8.06 లక్షల కోట్లు. రెవెన్యూ వ్యయాల్లో వడ్డీ చెల్లింపులు రూ.8.8 లక్షల కోట్లు కాగా... ప్రధాన సబ్సిడీల కింద రూ.3.6 లక్షల కోట్లను ప్రభుత్వం వెచ్చించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని