పదేళ్లలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు

గత పదేళ్లలో ఓ2సీ (ఆయిల్‌-టు-కెమికల్స్‌), టెలికాం వ్యాపారంపై దృష్టి సారించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) సుమారు 125 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.10,37,500 కోట్ల)కు పైగా మూలధన పెట్టుబడులు పెట్టినట్లు గోల్డ్‌మన్‌ శాక్స్‌ నివేదిక వెల్లడించింది.

Published : 01 Apr 2024 01:53 IST

రిలయన్స్‌పై గోల్డ్‌మన్‌ శాక్స్‌ నివేదిక

దిల్లీ: గత పదేళ్లలో ఓ2సీ (ఆయిల్‌-టు-కెమికల్స్‌), టెలికాం వ్యాపారంపై దృష్టి సారించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) సుమారు 125 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.10,37,500 కోట్ల)కు పైగా మూలధన పెట్టుబడులు పెట్టినట్లు గోల్డ్‌మన్‌ శాక్స్‌ నివేదిక వెల్లడించింది. వచ్చే మూడేళ్లలో రిటైల్‌, నూతన ఇంధన రంగంపై ఆర్‌ఐఎల్‌ దృష్టి సారించనున్నట్లు తెలిపింది. దీర్ఘకాల  మూలధన వ్యయాల చట్రం నుంచి కంపెనీ క్రమంగా బయటకొస్తోందని విశ్లేషించింది.

  • రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 2013-18 ఆర్థిక సంవత్సరాల మధ్య ఓ2సీ వ్యాపారంలో 30 బి.డాలర్ల (సుమారు రూ. 2.50 లక్షల కోట్ల) మూలధనాన్ని చొప్పించింది. 2013-24 మధ్య 4జీ/5జీ నెట్‌వర్క్‌ల కోసం టెలికాం వ్యాపారంలో 60 బి.డాలర్ల (సుమారు రూ.5 లక్షల కోట్ల) పెట్టుబడి పెట్టింది. దేశవ్యాప్తంగా 5జీ సేవల విస్తరణను దాదాపు పూర్తి చేసింది. త్వరలో టెలికాం టారిఫ్‌లు పెరిగే అవకాశం ఉండటంతో ఇప్పటికే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఓ2సీ వ్యాపారంతో పాటు టెలికాం రంగం నుంచి కూడా రిలయన్స్‌కు భారీగా నగదు ప్రవాహం ఉండనుంది. తక్కువ మూలధనం అవసరమయ్యే రిటైల్‌, నూతన ఇంధన రంగాలపై కంపెనీ వచ్చే మూడేళ్లలో దృష్టి సారించే అవకాశం ఉందని నివేదిక వివరించింది.
  • 2022-23లో రిలయన్స్‌ మూలధన వ్యయం 17.6 బి.డాలర్ల (సుమారు రూ.1.50 లక్షల కోట్ల)కు చేరినట్లు అంచనా వేసిన నివేదిక.. 2025-26 నాటికి అది క్రమంగా తగ్గి 11.2 బి.డాలర్ల (సుమారు రూ.93,000 కోట్ల)కు పరిమితమవుతుందని తెలిపింది. 2024-27 ఆర్థిక సంవత్సరాల మధ్య కంపెనీ రిటైల్‌ వ్యాపార ఎబిటా రెండింతలు అవుతుందని నివేదిక అంచనా వేసింది. కొత్త ఇంధన విభాగం కింద సౌర విద్యుత్‌, ఎలక్ట్రోలైజర్‌, పవన విద్యుత్‌ సామర్థ్యాలను ఆర్‌ఐఎల్‌ మెరుగ్గా వినియోగించుకుంటుందని తెలిపింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని