జీఎస్‌టీ.. మార్చి వసూళ్లు రూ.1.78 లక్షల కోట్లు!

మార్చిలో జీఎస్‌టీ వసూళ్లు ఏడాది క్రితంతో పోలిస్తే 11.5% పెరిగి రూ.1.78 లక్షల కోట్లకు చేరాయి. దేశీయంగా లావాదేవీలు 17.6% పెరగడం ఇందుకు కలిసొచ్చిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది.

Published : 02 Apr 2024 02:01 IST

దిల్లీ: మార్చిలో జీఎస్‌టీ వసూళ్లు ఏడాది క్రితంతో పోలిస్తే 11.5% పెరిగి రూ.1.78 లక్షల కోట్లకు చేరాయి. దేశీయంగా లావాదేవీలు 17.6% పెరగడం ఇందుకు కలిసొచ్చిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. 2017 జులైలో జీఎస్‌టీ విధానం అమల్లోకి వచ్చాక, నెలవారీ వసూళ్లకు సంబంధించి ఇది రెండో అత్యధిక మొత్తం కావడం గమనార్హం. 2023 ఏప్రిల్‌ నాటి రూ.1.87 లక్షల కోట్లే.. ఇప్పటివరకు అత్యధికమొత్తం. ఈ ఏడాది ఫిబ్రవరిలో జీఎస్‌టీ వసూళ్లు రూ.1,68,337 కోట్లుగా, కిందటేడాది మార్చిలో రూ.1,60,122 కోట్లుగా నమోదయ్యాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే, జీఎస్‌టీ వసూళ్లు రూ.20 లక్షల కోట్ల మైలురాయిని మించాయి.

  • మార్చిలో వసూలైన రూ.1.78 లక్షల కోట్లలో సీజీఎస్‌టీ రూ.34,532 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ రూ.43,746 కోట్లు, ఐజీఎస్‌టీ రూ.87,947 కోట్లుగా (దిగుమతులపై వసూలు చేసిన రూ.40,332 కోట్లతో కలిపి) నమోదైంది. సెస్సు వసూళ్లు రూ.12,259 కోట్లుగా ఉన్నాయి.
  • గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి జీఎస్‌టీ వసూళ్లు రూ.20.18 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2022-23తో పోలిస్తే ఈ విలువ 11.7% ఎక్కువ. వార్షిక వసూళ్లలో సీజీఎస్‌టీ రూ.3.76 లక్షల కోట్లు, ఎస్‌జీఎస్‌టీ రూ.4.71 లక్షల కోట్లు, ఐజీఎస్‌టీ రూ.10.27 లక్షల కోట్లు (దిగుమతులపై వసూలైన రూ.4.83 లక్షల కోట్లు), సెస్సు రూ.1.44 లక్షల కోట్లు (దిగుమతులపై వసూలైన రూ.11,915 కోట్లు) కలిపి ఉన్నాయి. 2023-24లో సగటున నెలవారీ జీఎస్‌టీ వసూళ్లు రూ.1.68 లక్షల కోట్లకు చేరాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.1.5 లక్షల కోట్లుగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని