బైజూస్‌లో 500 ఉద్యోగాల కోత!

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌.. 500 మంది వరకు ఉద్యోగులకు లేఆఫ్‌ ప్రకటించినట్లు తెలుస్తోంది. ఎటువంటి సర్వీస్‌ నోటీస్‌ లేకుండా, సంస్థ నుంచి బయటకు వెళ్లిపోవాలని సదరు ఉద్యోగులకు ఫోన్ల ద్వారా సమాచారం ఇస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Published : 03 Apr 2024 01:53 IST

దిల్లీ: ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌.. 500 మంది వరకు ఉద్యోగులకు లేఆఫ్‌ ప్రకటించినట్లు తెలుస్తోంది. ఎటువంటి సర్వీస్‌ నోటీస్‌ లేకుండా, సంస్థ నుంచి బయటకు వెళ్లిపోవాలని సదరు ఉద్యోగులకు ఫోన్ల ద్వారా సమాచారం ఇస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గతేడాది అక్టోబరులో ప్రారంభించిన వ్యాపార పునర్నిర్మాణ ప్రక్రియ తుది దశలో ఉందని కంపెనీ చెబుతుండగా, ఈ వార్తలు రావడం గమనార్హం. తాజా లేఆఫ్‌ల ప్రక్రియ 15-20 రోజుల ముందే మొదలైందని, 500 మంది సిబ్బందిపై ఈ ప్రభావం పడొచ్చని ఆ వర్గాలు తెలిపాయి. విక్రయ విభాగ సిబ్బంది, అధ్యాపకులు, కొన్ని ట్యూషన్‌ సెంటర్లపై ఉద్యోగుల కోతల ప్రభావం కనిపించొచ్చు. ఈ విషయంపై బైజూస్‌ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కంపెనీ అధికారిక ప్రతినిధి మాట్లాడుతూ ‘200 మిలియన్‌ డాలర్ల రైట్స్‌ ఇష్యూకు మెజారిటీ ఇన్వెస్టర్లు మద్దతు తెలుపుతున్నందున, క్లిష్ట పరిస్థితుల నుంచి కంపెనీ త్వరలోనే బయటపడవచ్చ’ని పేర్కొన్నారు. మార్చి నెల జీతాలు ఆలస్యమవుతాయని కంపెనీ ఉద్యోగులకు లేఖ రాసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని