యాంకర్‌ మదుపర్ల నుంచి వొడాఫోన్‌ ఐడియా రూ.5,400 కోట్ల సమీకరణ

ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఎఫ్‌పీఓ)కు ముందు, యాంకర్‌ మదుపర్ల నుంచి రూ.5,400 కోట్లు సమీకరించినట్లు వొడాఫోన్‌ ఐడియా ప్రకటించింది.

Published : 18 Apr 2024 02:16 IST

దిల్లీ: ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఎఫ్‌పీఓ)కు ముందు, యాంకర్‌ మదుపర్ల నుంచి రూ.5,400 కోట్లు సమీకరించినట్లు వొడాఫోన్‌ ఐడియా ప్రకటించింది. ఒక్కో షేరు రూ.11 చొప్పున 74 ఫండ్‌ సంస్థలకు 490.9 కోట్ల షేర్లను కేటాయించామని, దీంతో రూ.5,400 కోట్లు సమీకరించినట్లు వొడాఫోన్‌ ఐడియా ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. ఇందులో 79.52 కోట్ల షేర్ల (16.2%)ను 11 పథకాల ద్వారా 5 దేశీయ మ్యూచువల్‌ ఫండ్‌లకు కేటాయించారు. దేశీయ సంస్థల్లో మోతీలాల్‌ ఓస్వాల్‌ ఎంఎఫ్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎఫ్‌, ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌, క్వాంట్‌ ఎంఎఫ్‌ ఉన్నాయి. షేర్లు పొందిన వాటిలో జీక్యూజీ పార్టనర్స్‌ ఎమర్జింగ్‌ మార్కెట్స్‌ ఈక్విటీ ఫండ్‌, ఫిడెలిటీ, యూబీఎస్‌ ఫండ్‌ మేనేజ్‌మెంట్‌, అబుదాబీ ఇన్వెస్ట్‌మెంట్‌ అధారిటీ, ఆస్ట్రేలియన్‌ సూపర్‌, ట్రూక్యాపిటల్‌, మోర్గాన్‌ స్టాన్లీ, సిటీగ్రూప్‌ గ్లోబల్‌ మార్కెట్స్‌ మారిషస్‌, జుపిటల్‌ ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ ఉన్నాయి. వన్‌97 కమ్యూనికేషన్స్‌ (పేటీఎం) రూ.8235 కోట్లు, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) రూ.5,627 కోట్ల తర్వాత యాంకర్‌ మదుపర్ల నుంచి అత్యధికంగా సమీకరించిన సంస్థ వొడాఫోన్‌ఐడియానే కావడం విశేషం.

వొడాఫోన్‌ ఐడియా రూ.18,000 కోట్ల ఎఫ్‌పీఓ ఏప్రిల్‌ 18 (నేడు) ప్రారంభమై 22న ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణిగా రూ.10- 11 నిర్ణయించింది. 2020లో యెస్‌ బ్యాంక్‌ రూ.15,000 కోట్ల ఎఫ్‌పీఓ తర్వాత వస్తున్న అతిపెద్ద ఎఫ్‌పీఓ ఇదే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని