శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా

భారత్‌లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది.

Published : 19 Apr 2024 01:17 IST

దిల్లీ: భారత్‌లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే, వర్థమాన దేశాల్లో తయారు చేస్తున్న ఉత్పత్తుల్లో ఎక్కువ చక్కెరను ఉపయోగిస్తోందని ఈ సంస్థపై ఆరోపణలు రావడంతో, తాజాగా వివరణ ఇచ్చింది.

ఇంతకీ ఏం జరిగిందంటే..: ఐరోపా దేశాలతో పోలిస్తే భారత్‌ సహా దక్షిణాసియా దేశాలు, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాల్లో నెస్లే విక్రయిస్తున్న బేబీ ప్రోడక్ట్స్‌లో చక్కెర శాతం అధికంగా ఉంటోందని స్విట్జర్లాండ్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ పబ్లిక్‌ ఐ అండ్‌ ఇంటర్నేషనల్‌ బేబీ ఫుడ్‌ యాక్షన్‌ నెట్‌వర్క్‌(ఐబీఎఫ్‌ఏఎన్‌) ఆరోపించింది. వేర్వేరు దేశాల్లో నెస్లే విక్రయిస్తున్న 150 వరకు బేబీ ఉత్పత్తులను పరిశీలించినట్లు ఈ సంస్థ పేర్కొంది. ఈ సంస్థ నివేదిక ప్రకారం.. బ్రిటన్‌, జర్మనీలలో 6 నెలల శిశువుల కోసం అమ్మే సెరిలాక్‌లో ఎటువంటి చక్కెరనూ నెస్లే కలపలేదు. భారత్‌లో మాత్రం 15 సెరిలాక్‌ ఉత్పత్తుల్లో 2.7 గ్రాముల (ఒక్కో సర్వింగ్‌కు) చక్కెర ఉంది. ప్యాక్‌లపై ఈ కంటెంట్‌ను ప్రకటించారు.

సమీక్షించి, చర్యలు తీసుకుంటున్నాం.. నెస్లే ప్రతినిధి: ‘నెస్లే ఇండియా గత అయిదేళ్లలో రకాన్ని బట్టి 30% వరకు చక్కెరను తగ్గించాం. ఎప్పటికప్పుడు మా ఉత్పత్తులను సమీక్షిస్తూ, రీఫార్ములేట్‌ చేస్తూ చక్కెర స్థాయిలను తగ్గిస్తాం. పోషకాలు, నాణ్యత, భద్రత, రుచి విషయంలో ఎటువంటి రాజీ పడకుండా ఈ పనిచేస్తుంటాం’ అని నెస్లే ఇండియా ప్రతినిధి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని