73000 దిగువన బలహీనం!

ప్రతికూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో గత వారం దేశీయ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఇరాన్‌- ఇజ్రాయెల్‌ ఉద్రిక్తతలు పెరగడం, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ‘జూన్‌లో వడ్డీ రేట్లు తగ్గించకపోవచ్చన్న’ అంచనాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.

Published : 22 Apr 2024 02:09 IST

సమీక్ష: ప్రతికూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో గత వారం దేశీయ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఇరాన్‌- ఇజ్రాయెల్‌ ఉద్రిక్తతలు పెరగడం, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ‘జూన్‌లో వడ్డీ రేట్లు తగ్గించకపోవచ్చన్న’ అంచనాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దేశీయంగా చూస్తే.. మార్చిలో టోకు ద్రవ్యోల్బణం మూడు నెలల గరిష్ఠమైన 0.53 శాతంగా నమోదైంది. కంపెనీల త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో షేరు ఆధారిత కదలికలు ప్రభావం చూపాయి. లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం కావడంతో.. ఆ వార్తలూ ప్రభావం చూపుతున్నాయి. బ్యారెల్‌ ముడిచమురు 3.7% నష్టపోయి 87.1 డాలర్ల వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 83.38 నుంచి  83.44కు చేరింది. అంతర్జాతీయంగా చూస్తే.. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చొచ్చన్న భయాలతో, ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. చైనా జీడీపీ మొదటి త్రైమాసికంలో 5.3% వృద్ధి సాధించింది. యూరో ఏరియా ద్రవ్యోల్బణం మార్చిలో 2.4 శాతానికి తగ్గింది. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్‌ 1.6% నష్టంతో 73,088 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 1.7% తగ్గి 22,147 పాయింట్ల దగ్గర స్థిరపడింది. రంగాల వారీ సూచీల్లో ఐటీ, స్థిరాస్తి, ఆరోగ్య సంరక్షణ షేర్లు నష్టపోగా.. చమురు-గ్యాస్‌, లోహ, ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు లాభపడ్డాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) నికరంగా రూ.19,894 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, డీఐఐలు రూ.15,378 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు. ఏప్రిల్‌లో ఇప్పటివరకు విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు (ఎఫ్‌పీఐలు) నికరంగా రూ.5,254 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు.

లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 4:5గా నమోదు కావడం..
పెద్ద షేర్లలో అప్రమత్తతను సూచిస్తోంది.

ఈ వారంపై అంచనా: గతవారం ఒడుదొడుకుల మధ్య కదలాడిన సెన్సెక్స్‌, నష్టాల్లో ముగిసింది. ఒకదశలో 71,816 పాయింట్లకు పడిపోయిన సూచీ, కీలక మద్దతు స్థాయి 73,000 ఎగువకు చేరింది. ఈ స్థాయిని కోల్పోతే స్వల్పకాలంలో మార్కెట్‌ దిద్దుబాటుకు అవకాశం ఉంటుంది. మరోవైపు రికవరీ వస్తే, 74,000 పాయింట్ల వద్ద నిరోధం ఎదురుకావొచ్చు.
ప్రభావిత అంశాలు: అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలు ప్రభావం చూపుతాయి. ఇరాన్‌- ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతలు, మన కార్పొరేట్‌ కంపెనీల త్రైమాసిక ఫలితాలూ కీలకమే. ఏప్రిల్‌ డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు ముగింపు కారణంగా ఒడుదొడుకులు పెరిగే అవకాశం ఉంది. ఈ వారం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, నెస్లే, టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, మారుతీ, ఏసీసీ, ఎల్‌టీఐ   మైండ్‌ట్రీ, ఎంఫసిస్‌, ఇండియన్‌ హోటల్స్‌ వంటి దిగ్గజ కంపెనీలు ఫలితాలు ప్రకటించనున్నాయి. ఈ నేపథ్యంలో షేరు ఆధారిత కదలికలు చోటుచేసుకోవచ్చు. ఈనెల 26న జరగనున్న లోక్‌సభ ఎన్నికల రెండోదశ పోలింగ్‌పై దృష్టిపెట్టొచ్చు. ఆస్ట్రేలియా, జపాన్‌, యూరో ఏరియా, బ్రిటన్‌, అమెరికా సహా పలు దేశాల ఫ్లాష్‌ పీఎంఐ గణాంకాలు వెలువడనున్నాయి. బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌, పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా పరపతి సమావేశాలపై కన్నేయొచ్చు. రూపాయి కదలికలు, ఎఫ్‌ఐఐ పెట్టుబడుల నుంచి సంకేతాలు తీసుకోవచ్చు. ఇరాన్‌- ఇజ్రాయెల్‌ పరిణామాలు చమురు ధరలకు కీలకం కానున్నాయి.

తక్షణ మద్దతు స్థాయులు: 72,365, 71,816, 71,072
తక్షణ నిరోధ స్థాయులు: 73,473, 74,245, 74,952

సెన్సెక్స్‌ 73000 దిగువన ముగిస్తే, మరింత బలహీనపడొచ్చు.

సతీశ్‌ కంతేటి, జెన్‌ మనీ


నేటి బోర్డు సమావేశాలు

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, మహీంద్రా లాజిస్టిక్స్‌, ఆదిత్య బిర్లా మనీ, తేజాస్‌ నెట్‌వర్క్స్‌, ర్యాలీస్‌ ఇండియా, హాట్సన్‌ అగ్రో, కేశోరామ్‌ ఇండస్ట్రీస్‌


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని