స్మార్ట్‌ టీవీల సరఫరాలు తగ్గాయ్‌

కంపెనీల నుంచి స్మార్ట్‌ టీవీల సరఫరాలు, గతేడాది ఇదే సమయంతో పోలిస్తే, ఈ ఏడాది జనవరి-మార్చిలో 14% తగ్గాయని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ నివేదిక  వెల్లడించింది.

Published : 09 Jun 2024 03:21 IST

జనవరి-మార్చిపై కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ నివేదిక 

దిల్లీ: కంపెనీల నుంచి స్మార్ట్‌ టీవీల సరఫరాలు, గతేడాది ఇదే సమయంతో పోలిస్తే, ఈ ఏడాది జనవరి-మార్చిలో 14% తగ్గాయని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ నివేదిక  వెల్లడించింది. వినియోగదారు గిరాకీ స్తబ్దుగా ఉండటంతో పాటు.. ఇప్పటికే డీలర్ల వద్ద నిల్వలు అధికంగా ఉండటమే ఇందుకు కారణమని పేర్కొంది. ఈ క్యాలెండర్‌ ఏడాదిలో టీవీల సరఫరాల్లో 10% క్షీణత నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. సమీక్షా త్రైమాసికంలో చైనా కంపెనీ షియోమీని తోసిరాజని, శామ్‌సంగ్‌ మళ్లీ అగ్ర స్థానానికి చేరింది. చైనా బ్రాండ్ల స్మార్ట్‌ టీవీల సరఫరాలు 30% క్షీణించడం గమనార్హం. వన్‌ప్లస్, హైయర్, రియల్‌మీ బ్రాండ్ల స్మార్ట్‌ టీవీలు బాగా తగ్గాయని నివేదిక తెలిపింది. శామ్‌సంగ్‌ సరఫరాలు 40% పెరిగాయి. భారతీయ కంపెనీల స్మార్ట్‌ టీవీల సరఫరాలు 16 శాతంగా ఉన్నాయి. దక్షిణ కొరియా కంపెనీ ఎల్‌జీ సరఫరాలు 43% పెరిగాయి. మన దేశంలో స్మార్ట్‌ టీవీ విపణిలో ఎల్‌జీకి 15% మార్కెట్‌ వాటా ఉంది. చైనా బ్రాండ్లు ఎంఐ, టీసీఎల్‌ కంపెనీల సరఫరాలు వరుసగా 2%, 4% క్షీణత నమోదు చేశాయి. మన విపణిలో వీటి వాటా వరుసగా 12%, 7 శాతంగా ఉంది. సోనీ కంపెనీ సరఫరాలు 19% వృద్ధిని నమోదు చేయగా, దేశీయంగా ఈ కంపెనీకి 7% వాటా ఉంది. ‘దిగ్గజ, అందరికీ తెలిసిన బ్రాండ్లకు వినియోగదార్లు ప్రాధాన్యం ఇస్తున్నారు. శామ్‌సంగ్, ఎల్‌జీ, షియోమీ బ్రాండ్ల స్మార్ట్‌ టీవీలకు గిరాకీ బాగుంది. టాప్‌-5 కంపెనీల వాటా 2024 తొలి త్రైమాసికంలో 57 శాతానికి చేరింది. 2023 ఇదే సమయంలో ఇది 41 శాతంగానే నమోదైంద’ని రీసెర్చ్‌ అనలిస్ట్‌ ఆకాశ్‌ జత్వాలా వెల్లడించారు. మధ్య స్థాయి (మిడ్‌-టైర్‌) కంపెనీల్లో హైసెన్స్, పానసోనిక్, వెస్టెల్, తోషిబా, మోటోరోలా వంటివి వృద్ధి నమోదు చేశాయని, ఇవి క్యూఎల్‌ఈడీ టీవీలను 4కే రెజొల్యూషన్‌తో, మెరుగైన దృశ్య అనుభూతితో తక్కువ ధరకే అందిస్తున్నాయని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని