కార్ల రిటైల్‌ విక్రయాలు 1% తగ్గాయ్‌: ఫాడా

సార్వత్రిక ఎన్నికలు, ఎండల ప్రభావంతో ప్రయాణికుల వాహనాల (పీవీ-కార్లు, ఎస్‌యూవీలు, వ్యాన్లు) రిటైల్‌ విక్రయాలు గత నెలలో 0.96% తగ్గినట్లు వాహన డీలర్ల సమాఖ్య ఫాడా సోమవారం వెల్లడించింది.

Published : 11 Jun 2024 01:47 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికలు, ఎండల ప్రభావంతో ప్రయాణికుల వాహనాల (పీవీ-కార్లు, ఎస్‌యూవీలు, వ్యాన్లు) రిటైల్‌ విక్రయాలు గత నెలలో 0.96% తగ్గినట్లు వాహన డీలర్ల సమాఖ్య ఫాడా సోమవారం వెల్లడించింది. దేశంలోని 1503 ఆర్‌టీఏ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ఆధారంగా ఈ వివరాలను సంస్థ ప్రకటించింది. ప్రయాణికుల వాహన రిజిస్ట్రేషన్లు 2023 మే నెలలో 3,06,305 జరగ్గా, ఈ ఏడాది మే నెలలో 3,03,358కి పరిమితమయ్యాయి. ‘ఎన్నికల సందర్భంగా నగదు లభ్యత సమస్య ఏర్పడింది. ముఖ్యంగా రూ.50,000కు మించి నగదు తీసుకెళ్లేప్పుడు ఆధారం చూపాలనడం ప్రభావం చూపింది. దీంతోపాటు ఎండలు అధికంగా ఉండటం, కొత్త మోడళ్ల లేమి, తయారీ సంస్థల ప్రచార కార్యక్రమాలు బలహీనంగా ఉండటం వంటివి విక్రయాలపై ప్రభావం చూపాయ’ని ఫాడా ప్రెసిడెంట్‌ మనీష్‌ రాజ్‌  సింఘానియా వెల్లడించారు. ఎండల వేడి తాళలేక విక్రయ కేంద్రాలకు వెళ్లడాన్ని వాయిదా వేసుకున్న వారు 18 శాతం ఉన్నారనే అంచనాను వ్యక్తం చేశారు. ఈ ఏప్రిల్‌లో 3,35,123 ప్రయాణికుల వాహనాలు విక్రయమయ్యాయి. అంటే నెలవారీగా చూసుకుంటే మాత్రం, గత నెలలో వీటి అమ్మకాలు 9.48% తగ్గాయి. మొత్తంమీద చూసుకున్నా, ప్రయాణికుల వాహనాలు, ట్రాక్టర్ల విక్రయాల్లోనే స్వల్ప ప్రతికూల వృద్ధి నమోదైంది. అన్ని విభాగాల వాహనాలను కలుపుకుంటే మాత్రం సానుకూల వృద్ధే ఉంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని