Google: సీసీఐ జరిమానాతో వెనక్కి తగ్గిన గూగుల్‌

ప్లే స్టోర్‌ విధానాల్లో గూగుల్‌ తన గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందని.. ఈ క్రమంలో అనైతిక వ్యాపార కార్యకలాపాలకు పాల్పడుతోందంటూ సీసీఐ ఇటీవల రూ.936.44 కోట్ల భారీ జరిమానాను విధించింది. ఈ విషయంలో సీసీఐ ఆదేశాలకు అనుగుణంగా గూగుల్‌ మార్పులు చేపట్టింది.

Updated : 01 Nov 2022 14:59 IST

దిల్లీ: ప్లే స్టోర్‌ విధానాల్లో గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం సహా అనైతిక వ్యాపార కార్యకలాపాల నిరోధానికి చర్యలు చేపట్టాలన్న ‘కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (CCI)’ ఆదేశాల అమలుకు గూగుల్‌ (Google) చర్యలు చేపట్టింది. ఈ మేరకు భారత్‌లో వినియోగదారుల లావాదేవీలకు కావాల్సిన డిజిటల్ వస్తువులు, సేవల కొనుగోలు కోసం డెవలపర్‌లు ప్లే బిల్లింగ్ సిస్టమ్‌ను ఉపయోగించాలన్న తప్పనిసరి నిబంధనను గూగుల్‌ నిలిపివేసింది. అదే సమయంలో సీసీఐ తీర్పుపై న్యాయ సమీక్ష కోరేందుకు ఉన్న ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నామని తెలిపింది. 

ప్లే స్టోర్‌ విధానాల్లో గూగుల్‌ తన గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందని.. ఈ క్రమంలో అనైతిక వ్యాపార కార్యకలాపాలకు పాల్పడుతోందంటూ సీసీఐ ఇటీవల రూ.936.44 కోట్ల భారీ జరిమానాను విధించిన విషయం తెలిసిందే. వీటి నిరోధానికి చర్యలు చేపట్టాల్సిందిగా, నిర్దేశిత సమయంలోగా తన ప్రవర్తన మార్చుకోవాల్సిందిగా గూగుల్‌ను ఆదేశించింది. ఆండ్రాయిడ్‌ మొబైల్‌ వ్యవస్థలో యాప్‌ డెవలపర్లకు గూగుల్‌ ప్లేస్టోర్‌ కీలక సరఫరా ఛానెల్‌గా వ్యవహరిస్తోంది. మార్కెట్‌కు వచ్చే యాప్‌లపై యాజమానులకు నియంత్రణ ఇస్తోంది. జరిమానాతో పాటు థర్డ్‌-పార్టీ బిల్లింగ్‌/ యాప్‌ల కొనుగోలుకు చెల్లింపు సేవలను వినియోగించుకోకుండా యాప్‌ డెవలపర్లను అడ్డుకోరాదని సీసీఐ ఆదేశించింది. ఆర్థిక వివరాలు, ఇతర పత్రాలను అందించడానికి గూగుల్‌కు 30 రోజుల సమయాన్ని ఇచ్చింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని